Marriage: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ (12 Marriages Neelima) పేరు రెండ్రోజులుగా మీడియా.. సోషల్ మీడియాలో (Social Media) మార్మోగింది. 12 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అని.. బయటికి రాని పేర్లు మరెన్నో ఉన్నాయని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు.. ఈమెపై జిల్లాలోని పలు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ 12 పెళ్లిళ్లు, ఫిర్యాదులు.. ఆరోపణలపై మీడియా ముందుకొచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. తాను నిత్య పెళ్లికూతురిని కానే కాదని స్పష్టం చేసింది. 12 పెళ్లిళ్లతో మోసం చేసినట్లు మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని తేల్చి చెప్పింది. అంతేకాదు.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. న్యాయం కోసం రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఫలితం లేదని వాపోయింది. నిజం నిగ్గుతేల్చే వరకూ తాను పోరాటం చేస్తానని నీలిమ పేర్కొన్నది.
Read Also- Renu Desai: మీకు దండం పెడతా.. నాకు సాయం చేయండంటూ పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్?
నీలిమ మాటల్లోనే..
‘ రెండ్రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలే. బీటెక్ సెకండియర్ చదువుతున్నప్పుడు పెళ్లిళ్ల పేరమ్మ తెచ్చిన ఒక పెళ్లి సంబంధం మా తల్లికి నచ్చడంతో అంగీకరించాం. నిశ్చితార్థం తర్వాత పంతులు సెప్టెంబర్ 6న పెళ్లి (Marriage) ముహూర్తం నిశ్చయించారు. అయితే, ఆగస్టు 26న ప్రధాన బంధం పేరుతో తాళి కట్టారు. మా సంప్రదాయం ప్రకారం చేసుకుంటున్నామని అబ్బాయి కుటుంబం చెప్పింది. అబ్బాయి తరఫున వారు మాకు రూ.10 లక్షల చెక్ ఇచ్చారు. అమ్మాయి బాగా నచ్చిందని ఇచ్చారు. 26న నా పుట్టిన రోజు అయితే ఆ రోజు రాలేదని.. ఆ తర్వాత బిలేటెడ్గా చేశారు. సెప్టెంబర్ 2న, అబ్బాయికి ఇదివరకే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని మా అమ్మకు ఫోన్ వచ్చింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారికి ఎలా అన్యాయం చేయాలని అనుకుంటున్నారు. మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అని అతని భార్య చెప్పారు. అప్పుడు ఎంక్వయిరీ చేయగా అబ్బాయి ఫ్రాడ్ అని తెలిసింది’ అని నీలిమ వెల్లడించింది.
న్యాయం జరిగే వరకూ..
‘ అబ్బాయి మోసగాడని, అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఇతర దేశాలకు పంపిస్తాడని తేలింది. ఆ తర్వాత వాళ్ల డబ్బులు కూడా ఇచ్చేశాం. ఆ తర్వాత అబ్బాయి భార్య ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. పోలీసులు మా ఫిర్యాదును పట్టించుకోలేదు. కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. అమలాపురం ఎస్పీ ఆఫీస్, జనసేన (Janasena) పార్టీ నేతలు, మంత్రి వాసంశెట్టి సుభాష్ను కలిసినా న్యాయం జరగలేదు. చాలా మందిని కలిసినా.. పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగినా నాకు ఎవరూ న్యాయం చేయలేదు. అలా రెండేళ్లు గడిచిపోయింది. నేను 12 పెళ్లిళ్లు చేసుకున్నానని వస్తున్న వార్తలు ఫేక్. పోనీ ఇతను ఒక్కడు అయితే.. మిగిలిన 11మంది ఎవరు? నాపైన ఈ ఆరోపణలు చేసిన, చేస్తున్నవారు నిరూపించాలి. తగిన ఆధారాలు చూపించాలి. లేకపోతే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నాకు న్యాయం కావాలి అంతే’ అని నీలిమ మీడియాకు ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also- Gadwal Incident: హార్ట్ బ్రేకింగ్.. ఇలా చేసుంటే తేజేశ్వర్ బతికేవాడేమో!