Komati Reddy Venkata Reddy: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy) సంబంధిత అధికారులను ఆదేశించారు. (Hyderabad) హైదరాబాద్లో ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్ట్యా వర్షాకాలంలో ఆర్ అండ్ బీ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు.
జిల్లా హెడ్క్వార్టర్లలో అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఇంజినీర్లు, జిల్లాల్లో సూపరింటెండెంట్ (Engineers) ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, క్షేత్ర స్థాయి ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్ల కనెక్టివిటీకి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు.
Also Read: MP Dharmapuri Arvind: అభద్రతా భావం ఉంటే అమెరికా వెళ్లిపో.. నా ఫోన్ ట్యాప్ ఎందుకు చేశావ్!
మరమ్మతులపై ఆదేశాలు
వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించడానికి వీలుగా సాండ్బ్యాగ్లు, సిమెంట్ బ్యాగ్లు ఏఈ స్థాయిలో అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే నదులు, వాగుల వద్ద బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ సెంటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రధాన కార్యాలయ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని సూచించారు. తద్వారా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా రాష్ట్ర స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ప్యాచ్ వర్క్లపై ఆరా..
గతంలో ఏర్పడిన గుంతల రోడ్లు పూడ్చేందుకు ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టామని మంత్రి గుర్తుచేశారు. ఇంకా పెండింగ్లో ఉన్న రోడ్డు ప్యాచ్ వర్క్లపై అధికారులను ఆరా తీశారు. దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాల అంశాలను ప్రస్తావించి, ఆయా రోడ్ల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు మంత్రికి వివరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ పరిధిలోని స్టేట్ రోడ్స్కు సంబంధించి మొత్తం 1214 గుంతలు ఏర్పడగా, 2488 కిలోమీటర్ల రోడ్డు పాక్షికంగా దెబ్బతింది. ఇందులో 2186 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇంకా 302 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన రోడ్ల ప్యాచ్ వర్క్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
కల్వర్టులు, బ్రిడ్జిలపై ప్రత్యేక దృష్టి..
అలాగే, వాడుకలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలు, ఆర్ఓబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి), ఆర్యూబీ (రోడ్డు అండర్ బ్రిడ్జి)ల పనితీరును సైట్ విజిటింగ్ చేసి పరిశీలించాలని సూచించారు. నిరంతర రాకపోకలు ఉండే నదులు, వాగుల మార్గాల్లోని కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్ల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటి పురోగతితో పాటు, వాడుకలో ఉన్న వాటి నాణ్యతకు సంబంధించిన వివరాలతో వారంలోపు పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
కేజీ వీల్స్ ట్రాక్టర్లపై అవగాహన..
ముఖ్యంగా స్టేట్ రోడ్స్ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కేజీ వీల్స్ ట్రాక్టర్లు ( (ఇనుప చక్రాలున్న ట్రాక్టర్లు) ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకుండా రోడ్లపై తిరిగితే రోడ్లు దెబ్బతింటాయని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం పంటల సాగు సీజన్ కాబట్టి, కేజీ వీల్స్ ట్రాక్టర్లు (KG Wheels Tractors) రోడ్లపై తిరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించేలా కేజీ వీల్స్ ట్రాక్టర్ యజమానులకు, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రోడ్లు, భవనాల శాఖపై ప్రత్యేక బాధ్యతలు ఉంచారని, ఈ శాఖ గేమ్ ఛేంజర్ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో త్వరలో ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, అధికారులు పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉండాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy) సూచించారు.
Also Read: CM Revanth Reddy: డిజిటల్ యుగంగా ప్రపంచం.. నైపుణ్యాల పెంపునకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు!