Pakistan News: దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) ఇప్పటికే నానా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆహార పదార్థాలతో పాటు నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్ని తాకడంతో అక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్థానీయులపై తాజాగా మరో పిడుగు పడింది. ఆ దేశంలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఇంధన సంక్షోభం ఏర్పడింది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు అక్రమ రవాణా మార్గాలు మూసుకుపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్లతో బలూచిస్థాన్ సరిహద్దు పంచుకుంటుంది. ఇరాన్ నుంచి అక్రమంగా రవాణా చేసిన పెట్రోల్, డీజిల్పై ఎక్కువగా ఆధారపడి నడిపిస్తున్న పెట్రోల్ బంకులు ఆదివారం నుంచి పెద్ద సంఖ్యలో మూసిపడ్డాయి. బలూచిస్థాన్ అంతటా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో, అక్కడి ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కస్టమర్లు పెట్రోల్ బంకులకు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వందలాది మంది వాహన యజమానులు కనిపిస్తున్నారు. తమ వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని చెబుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యగా ఇంధన డెలివరీతో పాటు వాణిజ్య కార్యకలాపాలు అన్నింటినీ నిలిపివేశామంటూ బలూచిస్థాన్ వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు సర్క్యూలర్లు జారీ చేశారు. సరిహద్దులో పాదచారులను కూడా నిరవధికంగా నిలిపివేశామని పేర్కొన్నారు.
Read this- Air India: ఢిల్లీ వస్తున్న విమానంలో లోపం.. టెన్షన్ టెన్షన్
భద్రతా కారణాల దృష్ట్యా పంజ్గుర్, గ్వాదర్ జిల్లాల్లో ఇరాన్తో సరిహద్దు ప్రవేశాలను మూసివేశామని వివరించారు. తదుపరి నోటీసు జారీ చేసేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఓ ఉన్నతాధికారి ధృవీకరించారు. కాగా, స్థానిక వ్యాపార కార్యకలాపాలు, ఇరాన్ నుంచి చమురు రవాణాకు గ్వాదర్లోని ‘గబ్ద్-కలాటో 250 సరిహద్దు పాయింట్’ చాలా ముఖ్యమైనది.
స్థానికంగా పెట్రోల్ ధరను రూ.4.80 మేర, డీజిల్ ధరను రూ.7.95 మేర పెంచిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్లో లభ్యమయ్యే ఇంధనం, శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ప్రాసెసింగ్ చేయని ఇంధనంపై ఆంక్షలు ఉన్నప్పటికీ పాకిస్థాన్ కంపెనీలు ఈ ఇంధనాన్ని విక్రయిస్తుంటాయి. నిషేధం ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తక్కువ ధరకే వస్తుండడంతో ఈ ఆయిల్ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు.
Read this- Indian-Origin Dies: ఆస్ట్రేలియా పోలీసుల దుర్మార్గం.. మెడపై మోకాలితో తొక్కి.. ఇండియన్ హత్య!
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం కారణంగా ఇంధన సరఫరా ఆగిపోయిందని స్థానిక అధికారులు చెప్పారు. ఇరాన్లోని సరిహద్దు పట్టణాల నుంచి పాకిస్థాన్లోకి ఈ ఇంధనాన్ని తీసుకొస్తుంటారని, యుద్ధం కారణంగా రవాణా ప్రభావితమైందని పేర్కొన్నారు. సరిహద్దులు మూతపడడంతో ఇరాన్తో సరిహద్దు పంచుకునే బలూచిస్థాన్లోని టర్బాట్, గ్వాదర్, పంజ్గుర్, చాగై, వాషుక్, మష్కైల్తో పాటు పలు జిల్లాలో ఆహార కొరత కూడా ఏర్పడింది. ఆయా జిల్లాలకు ఆహార పదార్థాలు ఎక్కువగా ఇరాన్ నుంచి సరఫరా కావడమే ఇందుకు కారణంగా ఉంది.
ఇరాన్లోని మక్రాన్, రాఖ్షాన్, చాగై ప్రాంతాల ద్వారా ఇంధనం అక్రమ రవాణా జరుగుతుంది. సరిహద్దులు మూతపడడంతో దాదాపు 60 నుంచి 70 శాతం పెట్రోల్ బంకులు మూతపడ్డాయని ఓ అధికారి వివరించారు. అయితే, ప్రభుత్వ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, బలూచిస్థాన్ రాజధానిలో చాలా పెట్రోల్ బంకులు తెరిచే ఉన్నాయని, ప్రావిన్స్లో ఇంధన కొరత సమస్యలేదని పేర్కొన్నారు.
ఇంధన కొరత ఉత్తిదే
ఇంధన కొరత ఉందనే అభిప్రాయాలను షాహిద్ రిండ్ అనే అధికారి తోసిపుచ్చారు. శుద్ధి చేయని ఇరాన్ చమురును విక్రయించే పెట్రోల్ బంకులు భద్రతకు చాలా ప్రమాదకరమని, అందుకే ప్రభుత్వం ఈ నెల ఆరంభంలోనే వాటిపై చర్యలు ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ పెట్రోల్, డీజిల్ విక్రయం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు జనాల్లో భయాందోళనలు సృష్టించేందుకు వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఆయన వివరించారు. ఇరాన్ నుంచి ఇంధనం స్మగ్లింగ్పై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆశించేవారు ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.