Kodanda Reddy: నూతన విత్తన చట్టంతో రైతు రాజు కాబోతున్నాడని, ఈ చట్టాన్ని త్వరలోనే అమలులోకి రానుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) అన్నారు. మహబూబ్నగర్ (Mahabubnagar) కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సంతోష్(Santhosh) అధ్యక్షతన రైతు సమస్యల పరిష్కారానికి అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, రైతు ప్రతినిధులు, సీడ్ ఆర్గనైజర్స్, కంపెనీల ప్రతినిధులు వారి అభిప్రాయాలను కమిషన్కు వివరించారు. అనంతరం కోదండరెడ్డి (Kodanda Reddy) మాట్లాడుతూ, జిల్లాలో రైతులు శ్రమతో సాగు చేస్తున్న పత్తి పంట దేశీయంగా మాత్రమే కాకుండా చైనా వంటి దేశాలకు పోటీ ఇవ్వగల స్థాయిలో నడిగడ్డలో పత్తి పంట సాగు అవుతున్నదన్నారు.
ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు పథకాలు, కొత్త విధానాలను అమలు చేస్తుండటం రైతు సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. గద్వాలలో పత్తి విత్తనాల సమస్యలు తీవ్రంగా ఉండటంతో, కమిషన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల (Farmers) సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రైతులు (Farmer) పత్తి విత్తనాలు ఫెయిల్, అధిక వడ్డీ రేట్లతో అప్పుల్లో కూరుకుపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీవ్రంగా బాధించేదిగా ఉందని తెలిపారు. అందుకే రైతుల శాశ్వత రక్షణ కోసం కొత్త విత్తన చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నదన్నారు. ఇది విత్తన కంపెనీలపై నియంత్రణతో పాటు రైతుల హక్కులకు రక్షణ కల్పించనుందని పేర్కొన్నారు.
Also Read: Panchayat Raj Director: పల్లెల్లో పకడ్బందీగా.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి!
గతంలో ధరణి చట్టం వల్ల భూముల సమస్యలతో రైతులు (Farmer) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. వ్యవసాయ రంగంలో మహిళలకు ఎదురవుతన్న సమస్యలను కూడా పరిగణలోకి తీసుకుంటామని, మహిళా రైతులకు (Farmers) అన్యాయం జరగనివ్వమని తెలిపారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న సమస్యపై కమిషన్ స్పందించి న్యాయం చేసిందని గుర్తుచేశారు. గద్వాలలో విత్తనాల నాణ్యత, సరఫరా, కంపెనీల బాధ్యతపై స్పష్టత ఉండేందుకు రైతులకు మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా కంపెనీలతో సంబంధం పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వడ్డీ వ్యాపారం చేసే మనీ లెండర్లు లైసెన్స్తో పాటు ఆర్బీఐ నిబంధనల మేరకు వ్యవహరించాలని, లావాదేవీలపై కాలానుగుణంగా ఆడిట్ జరపాలని అధికారులను ఆదేశించారు.
ఆర్గనైజర్లపై రైతులకు నమ్మకం లేదు
సీడ్ పత్తి విషయంలో ఆర్గనైజర్లపై రైతులకు (Farmers) నమ్మకం లేకపోవడం వల్ల అందరికీ నష్టం జరుగుతుందని కమిటీ సభ్యులు కేవీ నర్సింహా రెడ్డి అన్నారు. ఆర్గనైజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తూ, త్వరలోనే కొత్త చట్టం ద్వారా ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మరో కమిటీ సభ్యులు సునీల్ కుమార్ మాట్లాడుతూ, 2005లో ఏర్పాటు చేసిన ఒప్పంద వ్యవసాయ చట్టం ప్రకారం కంపెనీలు రైతులతో వ్యవహరించాలన్నారు. రైతుకు నష్టం వాటిల్లినప్పుడు కంపెనీ భరించాల్సిన రిస్కును రైతులు భరించడం ఇబ్బందికరంగా ఏర్పడిందన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు పంపాం
రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. రైతుల అభిప్రాయాల మేరకు వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో పత్తి విత్తనాలే ప్రధాన ఆదాయ మార్గం కావడంతో సుమారు 30 వేల ఎకరాల్లో సాగు కొనసాగుతూ 40 వేల మంది రైతులు విత్తన ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. అందుకే ప్రభుత్వం రైతు సంక్షేమానికి కొత్త విధానాలు, చట్టాలు రూపొందించే పనిలో ఉన్నదని తెలిపారు.
Also Read: Gurram Malsur Appointed: సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సీపీఆర్వో ఎంపిక!