Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కేభవన్ హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ ఒన్ టు వన్ విచారణ చేశారు. కమిషన్ చైర్మన్ ఘోష్ ఉదయం 10.28 గంటలకు బీఆర్ కే భవన్ కు వచ్చారు. కేసీఆర్ మాత్రం ఉదయం 11.02 గంటలకు చేరుకున్నారు. కేసీఆర్ విచారణ హాల్లోకి 11.58 గంటలకు వెళ్లారు. అనంతరం కమిషన్ చైర్మన్ మధ్యాహ్నం 12.02 గంటలకు హాల్లోకి వెళ్లి విచారణను ప్రారంభించారు. దేవుడి మీద ప్రమాణంతో కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. 12.52 గంటల వరకు సాగింది. 50 నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ విచారణ కొనసాగించారు. ఈ విచారణలో కేసీఆర్ కు 18 ప్రశ్నలను వేశారు.
కేసీఆర్ విచారణను మొత్తం ఒన్ టు వన్
ఇప్పటివరకు 114 మందిని విచారించిన కమిషన్.. 115వ సాక్షిగా కేసీఆర్ ను విచారించింది. ఇప్పటివరకు విచారించిన వారందరిని ఓపెన్ కోర్టులో విచారణ చేసింది. అయితే కేసీఆర్.. తనకు జలుబుతో పాటు తన ఆరోగ్యం బాగా లేదని కమిషన్ చెప్పినట్లు సమాచారం. ఓపెన్ కోర్టు కాకుండా ఒన్ టు వన్ చేయాలని కమిషన్ ను కోరగా అందుకు అంగీకరించి.. కేసీఆర్ విచారణను మొత్తం ఒన్ టు వన్ చేసింది. కోర్టు హాల్లో లో ఓపెన్ కోర్టు కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులు, అధికారులను బయటకు పంపించాయి. అయితే కమిషన్ విచారణ సందర్భంగా ఓపెన్ కోర్టు హాల్లో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు.
కేసీఆర్ పలు జీవోలు, డాక్యుమెంట్లను అందజేత
కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్, కేసీఆర్, కమిషన్ సెక్రటరీ మురళీధర్, కమిషన్కు చెందిన ఇద్దరు నోడల్ అధికారులు ఉన్నారు. విచారణ సందర్భంగా కమిషన్కు కేసీఆర్ పలు జీవోలు, డాక్యుమెంట్లను అందజేసినట్లు సమాచారం. రీ ఇంజనీరింగ్, కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నలు వేసింది. రీ ఇంజనీరింగ్ చేయడానికి ప్రధాన కారణాలను కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు సంబంధించిన సీడీని సైతం కమిషన్కు అందేసినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి మహముద్ అలీ బీఆర్కే భవన్లోకి వెళ్లారు. వారికే అనుమతి కమిషన్ అనుమతి ఇచ్చింది.
Also Read: Revanth Reddy: కేసీఆర్ ను కాంగ్రెస్ లోకి రానీవ్వను.. సీఎం సంచలన వాఖ్యలు!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు విచారణ అనంతరం పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం విచారణకు ట్యాంక్ బండ్ సమీపంలోని బీఆర్కే భవన్ కు వస్తున్నారన్న సమాచారం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బీఆర్ కే భవన్ పరిసరాలన్ని కేడర్ తో కిక్కిరిసి పోయాయి. ముందస్తుగా భవన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఆంక్షలు సైతం విధించారు. అటు సచివాలయం వైపు, ఇటు లిబర్టీ వైపు, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వేలాది మంది పోలీసులు మోహరించారు. ఇక బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కేసీఆర్ కు మద్దతు
ఎక్కడికక్కడ దారులను మూసివేయడంతో.. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేసీఆర్కు మద్దతుగా జై కేసీఆర్.. జై తెలంగాణ అని నినాదాలు చేశారు. కేసీఆర్ ఉదయం 11 గంటలకు బీఆర్ కే భవన్ కు రావడంతో ఒక్కసారిగా కేడర్ నినాదాలు ఊపందుకున్నాయి. కేసీఆర్ కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేసీఆర్ ఫేస్ మాస్కులు ధరించి జై కేసీఆర్ అని నినాదించారు. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నినాదాలు చేసి.. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు.
కొంతమంది కార్యకర్తలు వాహనాలు ఎక్కి నినాదాలు చేయడంతో పోలీసులు వారిని కిందికి దించారు. కేటీఆర్ సైతం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్కే భవన్ వరకు ర్యాలీగా వచ్చారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన వెంట తరలించారు. ఆ పరిసరాలంతా కేడర్ తో నిండిపోయాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎంపీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ లు ఇలా అన్ని స్థాయిల్లో నాయకులు రాగా, పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎమ్మెల్యేలను ఒకవైపు, కార్యర్తలను మరోవైపు ఉంచారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం
ఇదిలా ఉంటే బీఆర్కే భవన్ పరిసరాలు పోలీసులతో మోహరించడంతో.. పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్గా ఉద్యోగాలకు వెళ్లే వారికి కూడా పోలీసులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అనుసరించిన తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ఒకానొక్క సందర్భంలో తొపులాటకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీసు బలగాలను మోహరించారు. బీఆర్కే భవన్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
విచారణ అనంతరం బయటకు వచ్చిన కేసీఆర్ నేరుగా తన కారులో ఎక్కి కూర్చున్నారు. అనంతరం అక్కడున్న పార్టీ శ్రేణులకు కారులో నుంచి లేచి కేసీఆర్ అభివాదం చేశారు. ఒక్కసారిగా కేడర్ జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. బీఆర్కే భవన్ నుంచి జంక్షన్ కు వచ్చేందుకు ప్రయత్నం చేయగా, కేడర్ భారీగా మోరింపు ఉండటంతో జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి పంపించారు. కేసీఆర్ కారులోనే హరీశ్రావు కూడా వెళ్లారు.
Also Read: Duddilla Sridhar Babu: సెమీ కండక్టర్ల తయారీ.. డిజైనింగ్ లో యువతకు శిక్షణ!