– రిజర్వేషన్లపై ఫేక్ వీడియో వైరల్
– 28న ఎఫ్ఐఆర్ నమోదు
– తెలంగాణకు ఢిల్లీ పోలీసులు
– గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలకు నోటీసులు
– నోటీసులు రాకుండానే రేవంత్ రెడ్డికీ ఇచ్చారంటూ జాతీయ మీడియాలో వార్తలు
– కొద్ది రోజులుగా రిజర్వేషన్లపై మోదీని నిలదీస్తున్న సీఎం
– కావాలనే రేవంత్కు నోటీసులు అంటూ ప్రచారం
– ఢిల్లీ బెదిరింపులకు భయపడనన్న తెలంగాణ సీఎం
Revanth Reddy: తప్పుడు ఎడిటెడ్ వీడియోలు ఎవరు చేసినా తప్పే. కానీ, దీన్ని రాజకీయంగా వాడుకుని బద్నాం చేయడం అంతకంటే పెద్ద తప్పు. బీజేపీ ఇప్పుడు అదే పని చేస్తోందనే విమర్శలు కాంగ్రెస్ సైడ్ నుంచి వినిపిస్తున్నాయి. సోమవారం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చారు. ఎందుకొచ్చారని అక్కడివారు అడిగితే, అమిత్ షా కు చెందిన ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, దీనిపై కేసు నమోదైందని తెలిపారు. నలుగురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు.
మొత్తం పది మందికి నోటీసులు
ఈనెల 25న అమిత్ షా మెదక్ పర్యటనకు వచ్చిన సందర్భంగా రిజర్వేషన్లపై మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. అయితే, కొందరు దీన్ని మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్టుగా ఎడిట్ చేశారు. ఇది అటూ ఇటూ తిరిగి సోమవారం బాగా హైలేట్ అయింది. దేశవ్యాప్తంగా పది మందికి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. 28న ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు.
బెదిరింపులకు భయపడమన్న రేవంత్
రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు వచ్చి నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ఇన్నాళ్లూ ఎన్నికల్లో గెలవడానికి సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా వాడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టు గురించి వారు తెలంగాణకు వచ్చినట్టు చెప్పారు. టీపీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి వాళ్లు వచ్చారట అని తెలిపారు. కానీ, ఇక్కడ వారి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని రేవంత్ రెడ్డి అన్నారు. తాము తిరిగి సమాధానం చెబుతామని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: హరీశ్ రావు ఇక నీ దుకాణం బంద్
రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు అంటూ ప్రచారం
కొద్ది రోజులుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్తో ఢీ అంటే ఢీ అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లపై బీజేపీ తీరును ఎండగడుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కూడా ఇచ్చారనే వార్తలు జాతీయ మీడియాలో జోరుగా వచ్చాయి. నిజానికి నోటీసులు ఇచ్చిన వారిలో రేవంత్ పేరు లేనే లేదు. ఇదంతా కావాలనే జరిగిన కుట్రగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడినందుకే!
ఢిల్లీ పోలీసులు తెలంగాణ పీసీసీ నాయకులకు నోటీసులు ఇవ్వడాన్ని ఏఐసీసీ సభ్యుడు, ఎంపీ మాణిక్కం ఠాగూర్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకులను బెదిరించడానికి, సమన్లు పంపించడానికి ఢిల్లీ పోలీసులను దుర్వినియోగపరచడాన్ని ఖండిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నాయకులను బెదిరించరాదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను నిలిపేయాలని అనుకుంటున్నదని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా తెలంగాణ ప్రజలపై దాడిగానే చూడాలని తెలిపారు.