RangaReddy News: తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను గుంజుకోవాలని చూడడం దారుణమని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కెపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఇక్కడే పెట్రోల్ పోసుకొని చనిపోతాం తప్ప భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. గ్రామంలోని సర్వే నెం.180లో ఉన్న 99 ఎకరాలను గోశాల కోసం తీసుకుంటున్న ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ గౌతమ్ కుమార్, సిబ్బంది స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Also Read: Janagaon Collectorate: కలెక్టరేట్ను ముట్టడించిన గుడిసె వాసులు.. పట్టించుకోని అధికారులు!
ఇందిరమ్మ సర్కారులో భూములు లాక్కుకోవడమేంటి?
ఈ సర్వే నెంబర్లో దాదాపు 100 కుటుంబాలు ఇక్కడ దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఈ భూమిని ప్రభుత్వం గోశాల కోసం తీసుకుంటే బతుకుదెరువు కోల్పోతామని వాపోయారు. ఇందిరమ్మ సర్కారు అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ సర్కారులో ఇచ్చిన భూములను లాక్కుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పదేళ్లుగా పట్టాలు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్ కు ఓట్లేశామని ఇప్పుడు నట్టేట ముంచితే ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. ఈ భూమికి సంబంధించి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కలెక్టర్ కు కలిసి వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన కలెక్టర్ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: Phone Tapping: సంచలన మలుపు తిరగనున్న ఫోన్ట్యాపింగ్కేసు!