Tobacco News: బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా బీడీ, సిగరెట్ తాగుతూ కనిపిస్తే మనకెందుకులే అనుకుని వెళ్తాం. కానీ రఘు నందన్ అలా కాదు. వారి వద్దకు వెళ్లి ఆ దురలవాటును మానేయాలని చెప్తాడు. గుట్కా, సిగరెట్ల వలిగే అనర్థాలను వివరించడంతోపాటు వాటికి అయ్యే ఖర్చును తగ్గిస్తే నెల తిరిగేసరికి ఎంత జమైతాయో లెక్కలతో సహా వివరిస్తారు. ఆడవాళ్లకు కూడా కర్తవ్వ బోధన చేస్తారు. రాఖీ కట్టే సందర్భంలో ధూమ పానం మానమని మాటతీసుకోండి అని సలహాలు ఇస్తారు. అతని మాట తారకమంత్రంలా పనిచేసి ఎంతోమంది సిగరెట్, గుట్కాలను మానివేసిన సందర్భాలెన్నో ఉన్నాయి.
అన్నా మీరు చెప్పిన మాట గొప్పగా పనిచేసి సిగరెట్, పొగాకు మానేశారని అనేకమంది మహిళామణులు ఫోన్ చేసి చెప్పిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. 22 ఏళ్ల క్రితమే ‘తంబాకు చోడో’ నినాదాన్ని భుజానకెత్తుకుని పొగాకు రహిత సమాజం కోసం కృషి చేస్తున్న పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిఫ్యూటీ తహసిల్దార్ మాచన రఘు నందన్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అతని సేవలకు ప్రతిగా ఎన్నో సన్మానాలు, ప్రశంసలతోపాటు పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డును సైతం రఘు నందన్ సొంతం చేసుకున్నారు.
ధూమపానం..సమ్మోహనకరమైన సైరన్:
మద్యం ఓ వ్యసనం. పొగ ‘తాగు’డు వ్యసనాల్ని మించిన వ్యసనం. పెదవులపై నాజుకుగా సాగే చుట్ట, సిగరెట్టు నేటి తరానికి అదో స్టెల్. అదో ఫ్యాషన్ సింబల్. గాల్లో మేఘాలు సృష్టిస్తూ గాల్లో తేలినట్టుందే అన్నట్లుగా మధురానుభూతిని కలిగించే ఆ పొగ సమ్మోహనకరమైన సైరన్ అని ఎవరూ గుర్తించడం లేదు. అప్పుడెప్పుడో కన్యాశుల్కంలో గిరీశం కూడా పొగ తాగనివాడు ‘దున్నపోతై పుట్టున్’ అంటూ వెంకటేశానికి ధూమపాన పాఠాలు ఘనంగా నేర్పుతాడు. కానీ ఆధునిక యుగంలో ఆ వ్యాపకం ఆరోగ్యానికి ఎంత హానికరమో శాస్త్రీయంగా తెలిసొచ్చినప్పటికీ మనిషి పొగల సెగలో తేలిపోతూ. కాలిపోతూ సాగిపోతూనే ఉన్నాడు.
ధూమపానం అలవాటు అనారోగ్యానికి మొదటి మెట్టు అని ఎవరూ గ్రహించడం లేదు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్టు పెట్టెలపైనా, మీడియా అడ్వర్టయిజ్మెంట్లతోపాటు బస్సులు, రైళ్లు ఇతర బహిరంగ ప్రదేశాల్లో రాసి ఉంటున్నప్పటికీ పొగతాగే అలవాటును మానుకోవడం లేదు. అనేక రోగాలకు కారణమయ్యే సిగరెట్ను వదిలించుకోవడం మన చేతుల్లో పని అని ఎవరూ అనుకోవడం లేదు. కానీ మాచన రఘునందన్ మాత్రం ఇది సాధ్యమేనంటూ ఎందరినో సిగరెట్ వ్యసనం నుంచి బయట పడేశారు.
ఈ పోరాటానికీ ఓ కారణం ఉంది:
మేడ్చల్ జిల్లా కేశవరం గ్రామం రఘునందన్ స్వస్థలం. ఆయన తండ్రి అభిమన్యు ఆంగ్లభాషా పండితుడు. రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన సందర్భంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ర్టపతి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన పెంపకం వల్లనే రఘునందన్ ఎటువంటి వ్యవసనాల జోలికి పోలేదు. అయితే 22 ఏళ్ల క్రితమే ‘క్విట్ టిబాకో’ నినాదాన్ని రఘునందన్ ఎత్తుకోవడానికి ఓ కారణముంది. రఘునందన్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ దీక్షితులుకు సిగరెట్ అలవాటు ఉండేది. ఆ అలవాటు ఆఖరుకు అతని ప్రాణం తీసింది. స్నేహితుడి మరణం రఘునందన్ను ఆలోచనల్లో పడేసింది. ఫ్రెండ్లాగే..ఎంతోమంది జీవితాలు టొబాకోకు బలికావద్దనుకున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే..సిగరెట్, తంబాకు అలవాటు ఉన్నవాళ్లను ఆ వ్యసనం నుంచి బయటపడేస్తున్నారు.
Also Read; Bandi Sanjay on BRS: నిజమే.. బీఆర్ఎస్ పొత్తు కోసం వచ్చింది.. బండి సంచలన కామెంట్స్
జాతీయ, అంతర్జాతీయ వేదికగా ప్రచారం:
క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు పొగాకు వల్ల కలిగే అనర్థాలపై రఘునందన్ అవగాహన కల్పిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగానూ పొగాకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పిస్తున్నారు. ఎక్స్ ఖాతా ద్వారానూ పోస్టులు పెడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు. పొగాకు నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు రావాలని దేశ విదేశాల్లోని స్వచ్చంద సంస్థలు అనేక సందర్భాల్లో రఘునందన్ను ఆహ్వానించాయి. వివిధ కారణాలతో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ ఆన్లైన్లో కాన్ఫరెన్స్ల్లో పాల్గొని తన లక్ష్యాన్ని వివరించి ప్రశంసలు అందుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రఘునందన్ను ఆహ్వానించింది. పంజాబ్ ఛండీగడ్ లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జాతీయ సదస్సులో భారత్ నుంచి రఘునందన్ ప్రాతినిధ్యం వహించారు. రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ సంస్థ ‘టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్’గా రఘునందన్ సేవలను గుర్తించడం విశేషం. అమెరికాకు చెందిన హెల్త్ మ్యాగజీన్ పల్మనరీ మెడిసిన్ కూడా రఘునందన్ సక్సెస్ ను గుర్తిస్తూ వావ్.. వెల్డన్ అని కొనియాడింది.
ఇటీవలే రాష్ర్టపతి భవన్ అధికార వర్గాలు ఫోన్ చేసి..పొగాకు నియంత్రణకు రఘునందన్ చేస్తున్న కృషిని అభినందించడంతోపాటు తాము సూచించిన రోజు రాష్ర్ట పతి భవన్ కు రావాలని ఆహ్వానం పంపారు. మరోపక్క.. పాత పెన్షన్ పథకం(ఓపీఎస్) పునరుద్దరణ కోసం రఘునందన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేసి ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని అనేక వేదికలపై ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన జరిగిన ఓ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై సీపీఎస్ రద్దుపై తన వాదనను బలంగా విన్పించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
Also Read: Narayana Murthy: రాజ్యసభకు పీపుల్స్స్టార్ నారాయణ మూర్తి.. ఏ పార్టీ తరఫునంటే?