Interpol: ఢిల్లీ (Delhi) లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో మాజీ అధికారి శుభం షోకీన్ వీసా మోసానికి పాల్పడ్డాడు. చట్ట విరుద్ధంగా వీసాలు (Visa) జారీ చేసి దరఖాస్తుదారుల నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నాడు. 2022లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఇంటర్పోల్ భారత్ (India) అభ్యర్థనతో సిల్వర్ నోటీస్ జారీ చేయగా, ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది.
ఎవరీ శుభం షోకీన్?
ఫ్రెంచ్ (French) రాయబార కార్యాలయంలో పని చేసిన శుభం షోకీన్ (Shubham Shokeen) 2019 నుంచి 2022 మంధ్య వీసా మోసాలకు పాల్పడ్డాడు. తన సహోద్యోగి ఆర్తి మండల్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. సరైన పత్రాలు లేకుండానే శుభం షోకీన్ వీసాలు జారీ చేశాడని ఆమె గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో సీబీఐ రంగంలోకి దిగింది. ఫ్రెంచ్ రాయబార కార్యాలయం నుంచి 64 వీసా ఫైళ్లు అదృశ్యమయ్యాయని గుర్తించింది. ట్విస్ట్ ఏంటంటే, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చే ముందే షోకీన్ భారత్ విడిచి పారిపోయాడు. అతని ఆచూకీ కోసం సీబీఐ ఇంటర్ పోల్ నుంచి బ్లూ నోటీస్ను కోరింది. షోకీన్ ఆస్తులను గుర్తించడంతోపాటు ఇతర సహాయాల కోసం భారత్ చేసిన అభ్యర్థనపై స్పందించిన ఇంటర్ పోల్ తాజాగా సిల్వర్ నోటీస్ జారీ చేసింది
అసలీ సిల్వర్ నోటీస్ ఎందుకిస్తారు?
సిల్వర్ నోటీస్ అనేది ఈ మధ్యే అందుబాటులోకి వచ్చింది. 2025 జనవరిలో ఇంటర్ పోల్ దీన్ని ప్రవేశపెట్టింది. ఓ వ్యక్తికి చెందిన అక్రమ ఆస్తులను ట్రాక్ చేయడంలో ఇది సహాయపడుతుంది. భారత్తోపాటు 50 దేశాల్లో ఈ సిల్వర్ నోటీస్ కార్యక్రమం నవంబర్ వరకు పైలట్ ప్రాజెక్ట్గా కొనసాగుతున్నది. ప్రతీ దేశం ఈ కాలంలో 9 సిల్వర్ నోటీసులను కోరవచ్చు. ఇటలీ అభ్యర్థన మేరకు మొదటి సిల్వర్ నోటీస్ జారీ చేయగా, ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. షోకీన్ ఆస్తులను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
దుబాయ్లో ఆస్తులు కూడబెట్టిన షోకీన్
సీబీఐ చెప్తున్న దాని ప్రకారం షోకీన్ 2019 సెప్టెంబర్ నుంచి 2022 మే నెల మధ్య వీసా మోసానికి పాల్పడ్డాడు. చట్ట విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వీసాలు జారీ చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.45 లక్షల దాకా వసూలు చేశాడు. అలా వచ్చిన సొమ్ముతో దుబాయ్లో 7.7 మిలియన్ దిర్హామ్లకు(రూ.15.7 కోట్లు) విలువైన ఆరు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్టు అధికారులు భావిస్తున్నారు.
Read Also- Cm Revanth Reddy: బీఆర్ఎస్ గొర్రెలు, బర్రెలు ఇస్తే.. మేం ఉద్యోగాలిచ్చాం.. సీఎం రేవంత్
మరో కేసులోనూ సిల్వర్ నోటీస్
క్రిప్టో కరెన్సీ అంటూ జనాన్ని ముంచి పారిపోయిన అమిత్ మదన్లాల్ లఖన్పాల్పైనా సిల్వర్ నోటీస్ జారీ అయింది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ దీన్ని జారీ చేసింది. ఎటువంటి లైసెన్సులు లేకుండా క్రిప్టో కరెన్సీ పేరుతో లఖన్పాల్ రూ.113 కోట్ల దాకా వసూళ్లకు పాల్పడ్డాడు. ఆర్థిక శాఖ ప్రతినిధిగా చెప్పుకుంటూ జనాన్ని మోసగించాడు. అలా సంపాదించిన సొమ్ముతో ఇతర దేశాల్లో ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఇంటర్ పోల్ జారీ చేసే నోటీసుల గురించి తెలుసా?
ప్రపంచంలోని దేశాలకు సమాచారాన్ని పంచుకోవడం కోసం ఇంటర్ పోల్ సాయం చేస్తుంటుంది. దీనికోసం పలు రంగుల నోటీసులను జారీ చేస్తుంటుంది.
- పారిపోయిన వారిని అరెస్ట్ చేసేందుకు – ఎరువు(రెడ్)
- గుర్తించడానికి – నీలం(బ్లూ)
- గుర్తించబడని మృతదేహాలకు – నలుపు(బ్లాక్)
- తప్పిపోయిన వారికి – పసుపు(ఎల్లో)
- అక్రమ ఆస్తులను ట్రాక్ చేసేందుకు – వెండి(సిల్వర్)
సరిహద్దులు దాటే ఆర్థిక నేరగాళ్లను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి సంస్థలు సిల్వర్ నోటీసులను ఉపయోగిస్తాయి.
Read Also- Tollywood: దిల్రాజుపై బాంబు పేల్చిన జనసేన బహిష్కృత నేత.. మొత్తం బండారం బయటపెట్టేశారుగా!