Big Breaking: తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో మందు బాబుల్లో గందరగోళం నెలకొన్నది. పూర్తి వివరాల్లోకెళితే.. తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ఆదివారం నాడు సర్క్యులర్లు జారీ చేసింది. క్వార్టర్ బాటిల్పై (180 ml) రూ.10, ఆఫ్ బాటిల్పై రూ.20, ఫుల్ బాటిల్పై రూ.40 మద్యం రేట్లు పెంచుతున్నట్లు దుకాణాలకు జారీ చేసిన సర్క్యులర్లలో ఎక్సైజ్ శాఖ పేర్కొన్నది. అయితే మద్యం రేట్లు పెంచినట్లు గానీ.. పెంచబోతున్నట్లు గానీ.. ఇప్పటి వరకూ ఎక్సైజ్ శాఖ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే బీర్ ధరలు పెరగడంతో మద్యం ప్రియులు ఆగమాగం అవుతున్నారు. తాజాగా.. మళ్లీ మద్యం ధరలు పెంచుతున్నట్లు వార్తలు వస్తుండటంతో మందు బాబుల్లో గందరగోళానికి గురవుతున్నారు.
ఎందుకిలా?
మద్యం సరఫరా కోసం లిక్కర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం వచ్చే నెల 30తో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ లోపే మద్యం ధరలు పెంచి డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లయ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖకు సూచించింది. కాగా, ఈ పెంచిన ధరలతో ఏటా ప్రభుత్వానికి అదనంగా రూ.2వేల కోట్లు ఆదాయం సమకూరనుంది.
Read Also- Nandigam Suresh: నందిగం సురేష్ మళ్లీ అరెస్ట్.. ఇక కష్టమేనా!
అయ్యో.. ఇప్పుడెలా?
అసలే వేడికి తట్టుకోలేక పైసలు లేకున్నా సరే, అప్పులు, ఖాతాలు పెట్టి మరీ మందు బాబులు వైన్స్ షాపు దారి పడుతుంటారు. ఇప్పుడు పెరిగిన ధరలతో లిక్కర్ లవర్స్కు చేదు అనుభవమే ఎదురవుతున్న పరిస్థితి. ధరలు పెరిగిన బోర్డును చూసి కంగుతినాల్సిందే. క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్పై పెరిగిన ధరలను చూసి ఒక్కసారిగా మద్యం ప్రియులకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యినట్లు బహిరంగంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఖజానాను భర్తీ చేసేందుకు మందు బాబులపైన పడ్డారా? మద్యం రేట్లు పెంచడమే ఏకైక మార్గమని ఇలా చేశారా? అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. ఉచిత పథకాల ప్రభావం ఇలాగే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్టులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మందుకొట్టి పట్టుబడ్డారు..
ప్రతీవారం స్పెషల్డ్రైవ్లు నిర్వహిస్తున్నా మందుబాబుల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు. సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి జరిపిన తనిఖీల్లో మొత్తం 308 మంది మద్యం సేవించి దొరికిపోయారు. వీరిలో 246 మంది ద్విచక్ర వాహనదారులు, 9మంది ఆటో డ్రైవర్లతోపాటు కార్లు నడుపుతూ దొరికిన వారు 50 మంది ఉన్నారు. ఒక భారీ వాహన డ్రైవర్కూడా పట్టుబడ్డాడు. దొరికిన అందరిపై కేసులు నమోదు చేశామని, వారిని ఆయా కోర్టులో హాజరు పరచనున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారణం అయితే వారిపై బీఎన్ఎస్చట్టం సెక్షన్ 105 ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కేసులో గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు.