Minister Seethakka: ప్రజలకు మాట ఇస్తే తప్పుకునేదే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజా పాలన ప్రభుత్వం ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడమే కాకుండా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పనిని పూర్తి చేస్తున్నామన్నారు. తాను ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని వెల్లడించారు.
మంగపేట మండలం శనగకుంట గ్రామంలో అగ్నిమాపక బాధితులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గత సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదంలో శనిగ కుంటలోని కొన్ని కుటుంబాల వారు సర్వస్వం కోల్పోగా ఆ క్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బాధిత టుంబాలకు వంట సామాన్లతో పాటు బట్టలను అందజేయడం జరిగిందన్నారు. 300 స్వచ్ఛంద సేవా సంస్థలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించామని వివరించారు.
Also Read: Farmers concern: మల్టీ నేషనల్ కంపెనీల కుట్రలు.. రైతులకు న్యాయం ఎప్పుడంటే?
అగ్నిమాపక బాధితులు ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసం కల్పించడానికి ప్రత్యేక సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఐటిడిఏ ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ముఖ్యంగా మంచినీటి ఎద్దడిని నివారించడానికి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో నేడు ప్రతి ఇంటి ఇంటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతుందని, గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి భూమి పూజ చేయడం సంతోషం కలిగిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ మంచి నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని చర్యలు తీసుకుంటున్నామని, పరిపాలన కేంద్రంగా ఉంటున్న ఐటీడీఏలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించడమే కాకుండా అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానీ పేదలు ఎవరు ఆందోళన చెందవద్దని, రెండో దఫా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు తగిన ఏర్పాట్లు లేవు.. అధికారులపై పుట్ట మధు ఫైర్!
ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్న లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు చెల్లించడానికి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ… శనిగకుంట గ్రామంలో నీటి సమస్య ఉన్న కారణంగా గ్రామస్తులు నీటిని నిలువ చేసుకొని సేవించడం వలన అనేక వ్యాధుల బారిన పడ్డారని, మంత్రి ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో మంచినీటి సమస్యను తీర్చామని అన్నారు.
ప్రభుత్వం, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి చొరవ చూపుతున్నామని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరువిషయంలో మధ్యవర్తులకు ఏమాత్రం అవకాశం కల్పించడం లేదని స్పష్టం చేశారు. వరద ముప్పు, అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా సాయంచేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి, తాసిల్దార్ రవీందర్, ఎంపీడీవో, ఆయా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు