CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన సీఎం.. ఉద్యోగులు, యాజమాన్యానికి శుభాభినందనలు తెలియజేశారు. సొనాటా సాఫ్ట్వేర్.. అత్యాధునిక AIని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమని సీఎం అన్నారు.
పరిశ్రమలకు మద్దతు
హైదరాబాద్ మహానగరం సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ తో పాటు అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) హబ్గా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని కొనియాడారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి IT దిగ్గజాలు తమ క్యాంపస్లను విస్తరిస్తున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ సర్కార్.. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని అన్నారు.
వాటిలో తెలంగాణ టాప్
డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ. లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని రేవంత్ రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటనలో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో తెలంగాణ నంబర్ వన్ అంటూ కొనియాడారు.
ఆ పనులకు శ్రీకారం
రాష్ట్రంలోని 66 లక్షల మంది మహిళలకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్లో ట్రాన్స్జెండర్లను స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో AI నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కార్ చేపట్టినట్లు సీఎం గుర్తుచేశారు.
Also Read: India Pakistan Ceasefire: ఓవైపు భారత్ – పాక్ చర్చలు.. మరోవైపు ప్రధాని అత్యున్నత భేటి.. ఏం జరుగుతోంది!
మరిన్ని ప్రపంచ ఈవెంట్లు
ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తరహాలో మరిన్ని ప్రపంచ ఈవెంట్లను రాష్ట్రంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందని అన్నారు. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్ను అత్యాద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నట్లు రేవంత్ చెప్పారు. హైదరాబాద్కు బ్రాండ్ అంబాసడర్లుగా మారాలని పిలుపునిచ్చారు.