India Vs Pak War: అవును.. ఇండియా-పాకిస్థాన్ మధ్య యుద్ధం ముగిసినట్టే. ఈ సంచలన ప్రకటన చేసింది మరెవరో కాదు అగ్రరాజ్యం అధిపతి డోనాల్డ్ ట్రంప్. శనివారం సాయంత్రం భారత్-పాక్ యుద్ధంపై సోషల్ మీడియా వేదికగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. తక్షణ సీజ్ఫైర్కు భారత్, పాక్ అంగీకరించాయి. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించాం. రాత్రంతా భారత్-పాకిస్తాన్లతో చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాలకు నా అభినందనలు’ అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. ఇండియా- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు. భారత్ ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవాల్, అసిమ్ మాలిక్లతో సుదీర్ఘ సమావేశం జరిగిందని వెల్లడించారు. ఈ భేటీలో తాను కూడా పాల్గొన్నానని రుబియో తెలిపారు.
ఇకపై ఏం జరిగినా యుద్ధమే..
పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నది. శనివారం సాయంత్రం ఉగ్రవాదులు, ఉగ్రమూకలకు మద్దతు పలికే వారికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్ర చర్యనైనా దేశంపై యుద్ధంగా పరిగణించాలని, దానికి తగువిధంగా స్పందించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇదొక కీలక నిర్ణయమే అని చెప్పుకోవచ్చు. కాగా, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతోపాటు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులను నిశితంగా చర్చించారు. మరోవైపు ప్రధాని మోదీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై తాజా పరిణామాలు, పాకిస్తాన్ దాడులు, భారత్ కౌంటర్పై సుమారు గంటకు పైగా ప్రధానికి వివరించారు. ఈ భేటీ కంటే ముందు త్రివిధ దళాధిపతులతో కూడా దోవల్ భేటీ అయ్యారు. ఈ ప్రకటన వచ్చిన గంట వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు.
Read Also- India Pak War: చేతులెత్తేసిన పాక్.. కరుణించిన భారత్.. కాల్పుల విరమణ
ఇప్పటి వరకూ ఏం జరిగింది?
పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పీఓకేతో పాటు పాక్లో తలదాచుకున్న ముష్కర మూకలపై వైమానిక దాడులు జరిపి ‘దటీజ్ ఇండియా’ అనిపించుకున్నది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భీకరమైన మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 స్థావరాలపై జరిగిన ఈ దాడిలో దాదాపు 80 మంది ముష్కరులు హతమయ్యారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ త్రివిధ దళాలు సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ. దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో ఉన్న లష్కరే క్యాంప్, సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్ – రాజౌరీకి 35 కి.మీ. దూరంలో ఉన్న గుల్పూర్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30 కి.మీ. పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్, జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్, రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ. దూరంలో ఉన్న జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్, రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10 కి.మీ. పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్, సాంబా – కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీ. దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్, అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ. దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్లపై భారత్ మెరుపు దాడులు చేసింది.