Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్ లో పీఓకే (POK)తో పాటు పాక్ లో తలదాచుకున్న ముష్కర మూకలపై వైమానిక దాడులు జరిపింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు మెరుపు దాడులు చేసింది. మెుత్తం 9 స్థావరాలపై జరిగిన ఈ దాడిలో దాదాపు 80 మంది ముష్కరులు హతమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా, ఇండియన్ ఆర్మీ (Indian Army), ఎయిర్ ఫోర్స్ (Air Force), నేవీ (Navy) బలగాలు సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్ చేపట్టడం విశేషం.
మాక్ డ్రిల్ పేరుతో బురిడి!
భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో సోమవారం.. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ (Mock Drills) నిర్వహించనున్నట్లు చెప్పింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తదితర నగరాలతో పాటు 259 ప్రదేశాల్లో మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. దీంతో భారత్ లో ఏం జరుగుతోందంటూ ప్రపంచ మీడియా దృష్టి భారత్ పై పడింది. అటు పాక్ సైతం మాక్ డ్రిల్ పై దృష్టి కేంద్రీకరించింది. మాక్ డ్రిల్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, మెజారిటీ సైన్యం ఈ డ్రిల్స్ లో బిజీగా ఉంటాయని భావించి కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది.
అదే అదునుగా..
పాక్ ఏమరపాటును అవకాశంగా మలుచుకున్న భారత సైన్యం.. మంగళవారం అర్ధరాత్రి ఆ దేశంపై విరుచుకుపడింది. లష్కరే తోయిబా (Lashkar-e-Taiba), జైష్-ఎ-మహ్మద్ వంటి నిషేధిత ఉగ్రసంస్థలకు చెందిన స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్ర క్యాంపులను నాశనం చేసింది. ధ్వంసం చేసిన వాటిలో పాకిస్థాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలు ఉన్నాయి. ఇందులో జైషే మహ్మద్కు చెందిన నాలుగు, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి. అయితే అనుకున్న పని పూర్తి చేయడంతో.. సోమవారం పిలుపునిచ్చిన మాక్ డ్రిల్స్ ను కేంద్రం విరమించుకోవడం గమనార్హం.
దాడులు జరిపిన స్థావరాలు ఇవే
1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం
2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్
3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్
4. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్
5. జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్
6. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్
7. రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్
8. సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.
9. అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్
సింధూర్ పేరుతోనే ఆపరేషన్ ఎందుకు!
పాక్ ముష్కర మూక స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సింధూర్ పేరు పెట్టడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఏప్రిల్ 22న పహల్గంలో జరిగిన ఉగ్రదాడిలో మెుత్తం 28 మంది అమాయక భారత పురుషులు చనిపోయారు. అందులో 26ఏళ్ల నేవి అధికారి వినయ్ సైతం మరణించాడు. పెళ్లి జరిగిన ఐదు రోజులకే వినయ్ ను టెర్రరిస్టులు చంపేయడంతో ఆయన భార్య హిమాన్షి గుండెలవిసేలా మృతదేహం వద్ద కన్నీరుమున్నీరు అయ్యారు. ఆమెతో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. వారి నుదిటిన చెరిగిన సింధూరానికి ప్రతీకారంగా ఈ దాడికి ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును పెట్టారు.