Solar Pump Sets: పునరుత్పాదక ఇంధన రంగంలో రాణిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సోలార్ పంపుసెట్లను భారీగా కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఈమేరకు ఢిల్లీలో మంగళవారం నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి మూడు ప్రత్యేక వినతులను భట్టి అందించారు.
వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకారం అందించాలని కేంద్ర మంత్రిని భట్టి కోరారు. అలాగే కుసుం-ఏ పథకం కింద రాష్ట్రానికి మరిన్ని కేటాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలుస్తోందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వివరించారు.
Also Read: Allegations on GHMC: గులాబీ పాలన హయాంలో అక్రమ నియామకాలు.. కొత్త సర్కారుకు ఎదురైన సవాళ్లు!
ముందే నిర్ణయించిన విధంగా పీఎం కుసుం కంపోనెంట్ ఏ కింద 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఎంఎన్ఆర్ఈ ఈవోఐ పీరియడ్ ప్రకారం పున:సమీక్ష అనంతరం కేటాయింపులను 4000 మెగావాట్ల నుంచి 1000 మెగావాట్లకు తగ్గించి ఇవ్వాలని యోచించినట్లుగా తమకు సమాచారం అందిందని, అలా తగ్గించి ఇస్తే రాష్ట్రం నిర్ధారించుకున్న లక్ష్యాలపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితులున్న నేపథ్యంలో కేంద్రం ఆచుతూచి వ్యవహరించాలని కోరారు.
రాష్ట్రంలోని వ్యవసాయరంగానికి సాగునీటి కల్పనకు శాశ్వత పరిష్కారంగా సౌర పంప్సెట్లు ఏర్పాటుచేయాలని రాష్ట్రం భావిస్తోందని, ఈ నేపథ్యంలో పీఎం కుసుం కంపోనెంట్ బీ కింద 1 లక్ష సౌర పంపు సెట్లను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను రెడ్కో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. రాష్ట్ర వాటా నిధులు కేటాయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రికి వివరించారు.
Also Read: Jupally Krishna Rao: జూపల్లి కృష్ణారావు ఆదేశాలపై.. మిస్ వరల్డ్ పోటీలకు ప్రత్యేక స్వాగతం!
కాగా గిరిజనుల సాగు భూముల్లో విద్యుత్ లైన్ల స్థాపనకు అటవీ చట్టాలు ఆటంకంగా ఉన్నందున కేంద్రం సహృదయంతో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. అలాగే పీఎం కుసుం కంపోనెంట్ సీ కింద 2 లక్షల పంపు సెట్లను తెలంగాణకు కేటాయించాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 28 వ్యవసాయరంగ సాగునీటి అవసరాల కోసం లక్షల పంపు సెట్లు వినియోగంలో ఉన్నందున సాంప్రదాయ విద్యుత్ రంగం పై భారాన్ని నివారించేందుకు వీటి అవసరముందని కేంద్రమంత్రికి వివరించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు