Harish Rao
Politics

Harish Rao: కాంగ్రెస్ నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిటశాపం

Harish Rao: రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) చెల్లించరా అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆదివారం ప్రభుత్వంపై ఆయన పైర్ అయ్యారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, వారి చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని మండిపడ్డారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు.

సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీసెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగాని తనమేనని విమర్శించారు. మరోవైపు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు.

Read Also- Min Ponguleti Srinivasa Reddy: ధరణితో భూ హ‌క్కులు విధ్వంసమే.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి!

అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా, కొన్నిచోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారని హరీశ్ రావు అన్నారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ ప్రారంభించిన పథకాన్ని ఎలాంటి మార్పు లేకుండా కేసీఆర్ అమలు చేసి గొప్ప మనసు చాటుకున్నారన్నారు. కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా, ఏనాడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆపలేదని గుర్తు చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం రూ.19,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశామన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతున్నదన్నారు. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టారని, దానికి అతి గతి లేదని,  ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, మరుగున పడేలా చేశారని ధ్వజమెత్తారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, రెండు నెలల్లో మొత్తం క్లియర్ చేస్తామని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పిన మాటలు, ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయన్నారు. మాట మీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదని చురకలంటించారు.

ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారని హరీశ్ రావు దుయ్యబట్టారు. విద్యార్థుల పరీక్ష ఫీజులు కూడా చెల్లించని దారుణమైన స్థితిలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. 17 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లకు, డిగ్రీ కళాశాలలకు, మెడికల్ కాలేజీలకు తాళాలు పడ్డాయని చెప్పారు. ఇక, గురుకులాలది దీన గాథ అని, విద్యావ్యవస్థలో తెచ్చిన కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read Also- Telangana Mangoes: ఈ మామిడి పండు రుచి, రేటు.. అంతకుమించి!

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది