Jangaon district: కరువు పనుల్లో భాగంగా కూలీలు తవ్వకాలు జరుపుతుండగా వైష్ణవ భక్తుడి శిల్పం బయటపడింది. జనగామ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శామీర్ పేట గ్రామంలో ఈ విగ్రహం దొరికింది. గ్రామంలోని పాటిమీది ఉన్న ఆవునూరి మల్లారెడ్డి పొలంలో కరువు పనులు జరుగుతున్నాయి. కూలీలు తవ్వకాలు జరుపుతుండగా కోర మీసాలు, గడ్డం, చెవులకు ఆభరణాలు, ఎడమవైపు వృత్తాకారపు శిగముడితో ఆకర్షణీయంగా ఉన్న వైష్ణవ భక్తుడి విగ్రహం బయటపడింది. శిల్పంతో పాటు బూడిద రంగులో ఉన్న కుండ పెంకులు, ఇటుకలు, దేవాలయ స్తంభాల కింద ఆధార పీఠాలు బయటపడ్డాయి. కూలీలు వెంటనే గ్రామ మండల అధికారులకు సమాచారం అందించారు. దీంతో బయటపడిన విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ అనిల్ పంచాయతీ కార్యదర్శి స్వప్న భద్రపరిచారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదని వారు తెలిపారు.
అధికారులకు సమాచారం ఇచ్చాం: కార్యదర్శి స్వప్న
కరువు పనుల్లో తవ్వకాలు జరుపుతుండగా పురాతన విగ్రహం బయటపడిందని పంచాయతీ కార్యదర్శి స్వప్న తెలిపారు. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని వివరించారు. విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో భద్రపరిచామని అన్నారు.
17వ శతాబ్దానికి చెందినవిగా గుర్తింపు
వైష్ణవ భక్తుడి శిల్పం కేవలం తల మాత్రమే బయటపడింది. ఇది 17వ శతాబ్దానికి చెందినదిగా పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శామీర్ పేట గ్రామంలో పురాతనమైన ఆలయం ఉన్నట్లు వీటిని బట్టి అర్థమవుతుందని ఆయన తెలిపారు. దేవాలయపు గోడలకు డంకు సున్నంతో వేసిన డిజైన్లు కనిపించాయని తెలిపారు. శైవ, వైష్ణవ, సూర్య విగ్రహాలు ఉండడం వలన త్రికూటాలయం ఉండేదని తెలుస్తుందని ఆయన అన్నారు. శివైక్యం చెందడానికి ముందు భక్తురాలు తనను సంహరిస్తున్న వారిని ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న శిల్పాలు ఉన్నాయన్నారు. గ్రామంలో కాకతీయుల కాలం నాటి శాసనం ఉన్నదని ఆయన వివరించారు. శామీర్ పేట లో పురావస్తు శాఖ అధికారులు పరిశోధన చేస్తే 17 వ శతాబ్దం నాటి ఆనవాళ్లు లభిస్తాయని అన్నారు దొరికిన విగ్రహాలను వస్తువులను భద్రపరిచి గ్రామంలోని మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు.
Also Read: Telangana Govt: మారుమూల పల్లెలకు మహర్దశ.. సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!