Notices To MLC Teenmar Mallanna: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని కేటీఆర్, జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు గతేడాది మే 25న వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తమపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫున న్యాయ వాది వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కేటీఆర్, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదని టీవీ రమణరావు కోర్టుకు తెలిపారు.
రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదైన కేసును కొట్టివేయాలని టీవీ రమణరావు కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులు, తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేశారు.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను జూన్ 13కు వాయిదా వేసింది.