అమరావతి: AP Govt: రాష్ట్రంలోని ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ [క్లాస్-2] ల గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రత్యేక మెజిస్ట్రేట్లకు పెంచిన గౌరవ వేతనంకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 30000 నుంచి రూ. 45000 కు పెంచినట్లు అలాగే రవాణా ఖర్చుల నిమిత్తం మరో రూ.5000 మొత్తాన్ని నెలకు చెల్లించనున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఇందులో ముఖ్యమైన విషయం గౌరవ వేతనం పెంపుదల2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తించేటట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
పాస్టర్ల గౌరవ వేతనంకు రూ.30 కోట్లు విడుదల
రాష్ట్రంలోని పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లింపు కోసం రూ. 30 కోట్లు బడ్జెట్ ను మైనారిటీ సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మే నెల నుంచి నవంబరు వరకు(7 నెలలు) పాస్టర్లకు గౌరవ వేతనాలు చెల్లింపు కోసం ఈ మొత్తాన్ని విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 8427 మంది పాస్టర్లకు త్వరలోనే క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వారి వారి బ్యాంక్ అకౌంట్లకు గౌరవ వేతనాన్ని జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
గుడ్ ఫ్రైడే ముందు రోజున ప్రభుత్వం పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు చెల్లింపు కోసం రూ. 30 కోట్లు మొత్తాన్ని విడుదల చేయడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నదని అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలను మైనారిటీ శాఖా మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.
Also Read: YS Sharmila on Modi: నాడు మట్టి, నేడు సున్నం.. ఇదేమి ట్వీట్ షర్మిలమ్మా..