Industrial Parks In Rural: గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్ మెంట్ ఆథారిటీ ఫైల్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఈ పార్కుల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభించడంతో పాటు భూముల ధరలు పెరగనున్నాయి.
అదే విధంగా పరిశ్రమల నుంచి గ్రామపంచాయతీలకు ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో గ్రామాలు సైతం ఆర్థికంగా బలోపేతం కానున్నాయి. ఈ పార్కుల్లో మహిళలకు సైతం10శాతం కేటాయించనున్నారు. కొన్ని మహిళలకోసమే ప్రత్యేక ప్రారిశ్రామికపార్కులను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయబోతున్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఒక వైపు పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానిస్తూమరోవైపు ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ప్రాస్ట్రక్షర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్( టీజీఐఐసీ) ద్వారా పార్కులను ఏర్పాటు చేసింది. అందులో భాగమైన ఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్ మెంట్ ఆథారిటీ(ఐఎల్ఏ) గ్రామీణ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటుంది.
ఏయే జిల్లాలో పార్కులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. సంబంధిత పైల్ ను పంచాయతీరాజ్ శాఖ గ్రామీణభివృద్ధిశాఖకు పంపింది. పార్కులతో గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనుండటం, గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టి చెందుతాయని భావించిన శాఖ ఆ ఫైల్ కు ఆమోదం తెలిపింది. దీంతో ఇక గ్రామాల్లో పార్కుల ఏర్పాటు మార్గం సుగమం అయింది.
పరిశ్రమల పన్నుల్లో 30శాతం గ్రామాలకు..
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక పార్కులకు భూ సేకరణ నుంచి పరిశ్రమలకు కావాల్సిన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన బాధ్యతలు అన్నిఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్ మెంట్ ఆథారిటీ తీసుకుంటుంది. స్థాపించబోయే పరిశ్రమల నుంచి పన్నులు అభివృద్ధి కోసం వసూలు చేయనుంది. అయితే వచ్చే ఆ పన్నుల్లో 30శాతం సంబంధిత గ్రామపంచాయతీలకు కేటాయించాలనే నిబంధనను పొందుపర్చారు. పంచాయతీరాజ్ ఆమోదం తెలిపిన ఆ ఫైల్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. ఫేజ్-1లో సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మేడ్చల్ ఇంకా కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో పార్కు 150ఎకరాలు
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల కోసం ఒక మినీ-ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ఫ్లాట్నెడ్ ఫ్యాక్టరీలు (బహుళ అంతస్తుల పారిశ్రామిక సముదాయాలు) ఏర్పాటు చేయనున్నారు. భూమి అందుబాటులో ఉన్నదాని బట్టి 15 ఎకరాలకు తగ్గకుండా ఆపై వేల ఎకరాలు ఉన్నా అక్కడ పార్కులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆ పార్కుల్లో మహిళా వ్యవస్థాపకుల కోసం ప్రభుత్వం ఒక శిక్షణ అకాడమీని ఏర్పాటు చేస్తుందని, మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జిలు) తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం చివరి మైలు కనెక్టివిటీని నిర్ధారించడానికి పరిష్కారాలను కనుగొనే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. మహిళా పార్కుల్లో వాటిలో ఎస్సీ, ఎస్టీమహిళా పారిశ్రామిక వేత్తలకు 10శాతం కేటాయించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే అన్ని పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10శాతం కేటాయించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం పేర్కొంది.
స్థలం గుర్తింపులో అధికారులు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అందుకోసం ప్రభుత్వ భూమి ఎన్నిఎకరాలు అందుబాటులో ఉంది.. ఏ గ్రామంలో ఉంది? నియోజకవర్గం కేంద్రంలో ఉన్నదా? అనే వివరాలను అధికారులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రైవేటు భూముని గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఏది ఏమైనా ప్రభుత్వం నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతో నిరుద్యోగులకు మాత్రం ఉపాధి లభించనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో 28458 ఎకరాల్లో 156 పార్కులను పలు జిల్లాల్లో ఏర్పాటు చేశారు.