తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Crime: పాతబస్తీలో రౌడీషీటర్ ను దారుణంగా హత్య చేశారు. మరో మూడు రోజుల్లో అతని పెళ్లి జరుగనుండగా ఈ హత్య జరగటం గమనార్హం. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పలు క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న ఫలక్ నుమా ప్రాంత నివాసి మహ్మద్ మసియుద్దీన్ (27) పై ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ నమోదై ఉంది. కాగా, ఇటీవలే మసియుద్దీన్ కు పెళ్లి ఖాయమైంది. ఈనెల 17న ముహూర్తం ఉండటంతో కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇక, తన పెళ్లి కార్డులను బంధువులకు పంచుతున్న మసియుద్దీన్ తెల్లవారుజామున రెయిన్ బజార్ లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి తన థార్ కారులో వెళ్లాడు. అయితే, రెండు బైక్ లపై వచ్చిన అయిదుగురు దుండగులు అతన్ని డబీర్ పురా ఫ్లై ఓవర్ బ్రిడ్జీ వద్ద అడ్డుకున్నారు. ఆ వెంటనే కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ మసియుద్దీన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వెంటనే దుండుగులు అక్కడి నుంచి వచ్చిన బైక్ లపై పారిపోయారు. విషయం తెలియగానే రెయిన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఆ గొడవే కారణమా…?
పోలీసుల విచారణలో మసియుద్దీన్ గతనెల 23 న మహ్మద్ షేర్, ఆసిఫ్, ఉమర్ అనే వ్యక్తులతో గొడవ పడినట్టు తెలిసింది. ఈ ఘర్షణలో మీ అందరినీ చంపేస్తా అంటూ మసియుద్దీన్ బెదిరించినట్టుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో మహ్మద్ షేర్, ఆసిఫ్, ఉమర్ లు తమ సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు. ఈ హత్యకు పాల్పడ్డ నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కేసు దర్యాప్తు చేస్తున్న రెయిన్ బజార్ పోలీసులు తెలిపారు.
Also Read: Case Against Aghori: లేడీ అఘోరీ ఆ పూజ చేస్తోందా? మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు..