Ahmed Basha Arrested: వైసీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. కువైట్ వెళ్తుండగా ముంబై ఎయిర్ట్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. కాగా అహ్మద్పై కడపలో పలు కేసు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన విదేశాలకు పారిపోతాడనే అనుమానంతో ముందుగానే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్ పోర్టు నుంచి కువైట్కు పారిపోతుండగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోనికి తీసుకొని కడప పోలీసులకు అప్పగించారు. ఆయన్ను ముంబై నుంచి తీసుకొచ్చిన కడప పోలీసులు సోమవారం కడప కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ అరెస్ట్ కడపలో, వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వారిలో అహ్మద్ ఒకరని పార్టీ నేతలు చెబుతుంటూరు.
విచక్షణ మరిచి నోటి దురుసుకు కేరాఫ్ అడ్రస్గా అహ్మద్ బాషాపై వైసీపీ నేతల నుంచే ఆరోపణలు కోకొల్లలు. అందుకే వైసీపీకి కంచుకోట లాంటి కడపలో ఆ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారకులు అంజాద్ బాషా తమ్ముడు, ఆయన బంధువులే అని వైసీపీ నేతలు మండిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Also read: Telangana : బీజేపీ నేతలకు కొత్త ట్విస్ట్.. కేసులుంటేనే లీడర్స్?
అసలేం జరిగింది?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కడప నగరంలోని పోలీస్స్టేషన్లోనే టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, ఆయన సతీమణి మాధవీరెడ్డిని రాయలేని భాషలో అహ్మద్బాషా బూతులు తిట్టారు. అంతేకాదు హిందూ మతానికి చెందిన మహిళను అహ్మద్బాషా తీవ్ర అవమానకర రీతిలో తూలనాడడం కడప నగరంలోని ఆ మతం ప్రజానీకం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇదే నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి దారి తీసింది.
అప్పట్లో తమను తిట్టడంపై శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు తాజాగా అహ్మద్బాషాను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. మరోవైపు కడప టౌన్లోని వినాయకనగర్ స్థలం విషయంలో అహ్మద్ బాషా దాడికి పాల్పడినట్లు స్థానికంగా కేసు నమోదైంది. అయితే అంజాద్ ఓడిపోవడం, మాధవీరెడ్డి గెలవడంతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని కువైట్ పారిపోవడానికి అహ్మద్ ప్రయత్నించారు. అప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు కూడా.
అయితే ముంబై వెళ్లిన ఆయన అక్కడ్నుంచి మూడో కంటికి తెలియకుండా విదేశాలకు వెళ్లిపోవాలని ప్రయత్నించడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ అరెస్టుతో అహ్మద్కు తగిన శాస్తి జరిగిందని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ సంతోషంగా ఫీలవ్వడం గమనార్హం.