Ambedkar Konaseema district: అదోక మారుమూల మత్స్యకార గ్రామం. సముద్రంపై ఆధారపడి జీవించే ఆ గ్రామస్తులకు అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చిపడ్డాయి. అంతుచిక్కని వ్యాధులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో రెక్కాడితో గానీ డొక్కాడని ఆ బతుకులు ఒక్కసారిగా చిన్నాభిన్నమయ్యాయి. వైద్య ఖర్చులు భరించలేక.. సముద్రంలో వేటకు పోలేక అల్లాడిపోయాయి. తమను ఆదుకునే వారే లేరా అంటూ ఆశగా ఎదురు చూశాయి. ఈ క్రమంలో వారి జీవితాల్లోకి ఓ వెలుగు వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema district) ముమ్మిడివరం నియోజకవర్గంలోని మత్సకార గ్రామం పల్లం (Pallam Village) ప్రాంతానికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఆ గ్రామంలోని ప్రజలను లివర్ సంబంధింత వ్యాధులు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య బారిన పడుతుండటం చూసి గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గ్రామాన్ని ఏ మహమ్మారి ఆవహించిందోనని తమలో తామే కుమిలిపోయారు.
రంగంలోకి ప్రభుత్వం
గ్రామస్తుల అనారోగ్య సమస్యలు ఆ నోటా ఈ నోటా పాకి.. ప్రభుత్వం (AP Govt) వద్దకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన కూటమి ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ను అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్రామంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించారు. మత్స్యకారులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలకు గల కారణాలను కనుగొనేందుకు రంగం సిద్ధం చేశారు.
Also Read: Nagababu vs Varma: పిఠాపురంలో ఉద్రిక్తత.. నాగబాబును అడ్డుకున్న వర్మ అనుచరులు..
విస్తృతంగా వైద్య పరీక్షలు
పల్లం గ్రామంలో సుమారు పదిహేను వేలమంది ప్రజలు నివసిస్తుండగా వారిలో 15 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత గ్రామస్తులకు హెపటైటిస్ బి,సి పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా ఆరు వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్కరికి రూ.6 వేలు విలువైన వైద్య పరీక్షలను ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేస్తున్నారు.
2వేల మంది నమూనాలు స్వీకరణ
పల్లం గ్రామంలో ఇప్పటివరకూ 2,200 మంది నుంచి రక్త నమూనాలు (Blood Samples) సేకరించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. తొలుత ర్యాపిడ్ టెస్టులు (Rapid Tests) చేసి వాటి ఫలితాల ఆధారంగా ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షలపై పూర్తి ఫలితాలు వచ్చాక.. అనారోగ్య సమస్యలు ఎందుకు తలెత్తాయో స్పష్టమవుతుందని వివరించారు.