AP Registrations New Policy: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అమరావతిలోని సచివాలయంలో రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులతో కలిసి స్లాట్ బుకింగ్ అవగాహన కరప్రతాన్ని, పోస్టర్ను మంత్రి అనగాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలనే చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు.
రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా అన్లైన్లో డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని ఫీజు కూడా కట్టేసి, ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చిన 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది.
ఒకవేళ స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయిన వారు ఆఫీసుకు వస్తే సాయంత్రం 5 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తాం. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా ఐదు వేల రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తాం. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్ష్యులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చని అనగాని వెల్లడించారు.
ప్రజలకు న్యాయం చేయాలనే..
స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్లు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయి. మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. మొత్తం 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశాం. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
పేద ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న, భూ యజమానులకు ఇబ్బందిగా ఉన్న నాలా యాక్ట్ను రద్దు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏమైనానా బకాయిలు, అపరాధ రుసుములు ఉంటే వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తాం. డబ్బు కోసం గడ్డితినే ప్రభుత్వం మాది కాదు. పేదల అభ్యున్నతి తోపాటు, అభివృద్ధిని కూడా సాధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటాం. గత ప్రభుత్వం భూ అరచాకాలు చేసింది. ఫ్రీ హోల్డ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడింది’ అని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు.
Also Read: Vontimitta Temple: ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.. పూర్తి సమాచారం మీకోసమే..
స్లాట్ బుకింగ్ ఇలా..
రిజిస్ర్టేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ registration.ap.gov.in లోని పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా డేటా ఎంట్రీ చేసి అప్లికేషన్ నెంబర్ను పొందాలి. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ మాడ్యూల్లో అప్లికేషన్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరోజు నుంచి 15 రోజుల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ 15 రోజుల్లో ఖాళీగా ఉన్న స్లాట్ను డైనమిక్గా వైబ్సైట్ ఎప్పుడూ చూపిస్తూ ఉంటుంది.