Palle Nidra – Palle Velugu: ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద్రముద్ర వేసింది. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సచివాలయంలో జరిగిన భేటీలో రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. మొత్తం 9 కీలకమైన అంశాలపై చర్చించి పచ్చజెండా ఊపారు. అనకాపల్లి జిల్లాలోని డీఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్టు నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మీడియా అక్రెడిడేషన్ నిబంధనలు-2025కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా పచ్చజెండా ఊపింది. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు కూడా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బార్ లైసెన్స్ ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ పచ్చజెండా ఊపింది. మరోవైపు, యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వం ప్రధాన సలహాదారులు హాజరయ్యారు.
ఉపాధి కల్పన పై ప్రత్యేక దృష్టి
భేటీ ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఎలాంటి ఊహాజనిత హామీలు లేకుండా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ఆర్సెలార్ మిట్టల్ నిస్పాన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు స్టీల్ ఉత్పత్తికి సంబంధించి చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని చెప్పారు. క్యాపిటివ్ పోర్ట్ నిర్మించాలంటూ నిస్సార్ ఇండియా లిమిటెడ్ అడిగిందని, వారు కోరిన విధంగా 2.9 కి.మీ.ల వాటర్ ఫ్రంట్తో అనకాపల్లి జిల్లాలో దీనిని నిర్మించబోతున్నట్టు ఆయన వివరించారు.
ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారు ఒక లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. కేబినెట్ నిర్ణయం ద్వారా మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.55,964 కోట్ల పెట్టుబడితో ప్లాట్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. జనవరి 2029 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే నిర్దేశించినట్టు చెప్పారు.
మొదటి దశలో దాదాపు 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. ఏడాదికి 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో దశ స్టీల్ ప్లాంట్ను రూ.80 వేల కోట్ల పెట్టుబడితో 2033 కి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వివరించారు. రెండో దశలో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అన్నారు. మరోవైపు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టే అన్ని చర్యలను తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.
పర్యాటక రంగానికి ఊతం
పర్యాటకులకు సరిపడా రూములు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ ఐదేళ్లలో దాదాపు 50,000 రూములను నిర్మించాలని లక్ష్యంతో పర్యాటక శాఖ ఉందన్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 3 స్టార్, అంతకంటే ఎక్కువ కేటగిరీ హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజును రూ.66 లక్షల నుంచి రూ. 25 లక్షలకు తగ్గించడానికి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. దేవాలయాల పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. ఈ మేరకు పర్యాటక రంగ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని వివరించారు.
Also read: Revanth Reddy on Rains: తెలంగాణలో అకాల వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ కోసం జల హారతి కార్పొరేషన్ పేరిట ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీరు వృథాగా పోతుండడంపై విచారం వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు విషయంలో గత ప్రభుత్వ అనుసరించిన విధానం కారణంగా ఎన్ఈసీఎల్, ఏపీజెన్కోకు వాటిల్లిన దాదాపు రూ.1735.35 కోట్ల నష్టాన్ని భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబర్లో జారీ చేసిన ఆర్బిట్రేషన్ అవార్డు అమలుకు కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ నిర్మించి తీరుతామని మంత్రి అన్నారు.
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్యాకేజీ నంబర్-4 ద్వారా నాగార్జున సాగర్ ఎడమ బ్రాంచ్ కెనాల్ వేంపాడు మేజర్లో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ:446 కోట్ల అదనపు ఆర్థిక సాయం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని కొలుసు పార్థసారథి వివరించారు. అధికారుల రిపోర్టుల ఆధారంగా గ్రామీణాభివృద్ధికి ఏమేం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తుందని వివరించారు. అన్ని మత విశ్వాసాలను గౌరవించడం ప్రభుత్వ లక్ష్యమని, వక్ఫ్ బిల్లుపై టీడీపీ ఇప్పటికే పలు కీలక సూచనలు చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి ప్రస్తావించారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై చర్చ
ఇటీవల రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు అంశం కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వైసీపీ వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తున్నా ఫేక్ ప్రచారం మాత్రం ఆపడం లేదని మండిపడ్డారు. పాస్టర్ మృతిపై చట్టపరంగా విచారణ జరిపినట్టు మంత్రులకు చంద్రబాబు వివరించారు.
ఈ కేసు దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రస్తావించారు. సున్నిత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు ఆయన సూచన చేశారు. అప్రమత్తంగా లేకుంటే బాబాయ్ గొడ్డలి, కోడికత్తి తరహాలో అన్ని ప్రభుత్వంపైనే వేస్తారని అన్నారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, లేనిపోని నిందలు, కుట్రలు చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు సందేశాలు వ్యాపింపజేస్తున్నారని, అన్నింటిపైనా అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Also read: CWC on Musi: మూసీకి ముప్పు.. కూడిపోతున్న జలాశయం.. హెచ్చరికలు జారీచేసిన సీ.డబ్ల్యు.సీ
అప్రమత్తంగా లేకుంటే ఏం జరుగుతుందో తెలియజేస్తూ కొన్ని ఉదాహరణలతో వివరించారు. మరోవైపు, రుషికొండ ప్యాలెస్ను ఏం చేయాలనే అంశంపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ భేటీలో చర్చించారు. ఏం చేయాలో చెప్పాలంటూ మంత్రుల సలహా కోరారు. తొలుత రుషికొండను సందర్శించాలని, ఆ తర్వాత ఒక అభిప్రాయానికి రావొచ్చని చంద్రబాబుకు మంత్రులు సూచించారు.
పల్లె నిద్ర చేయండి
మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు
మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం పల్లె వెలుగు స్వర్ణగ్రామం కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో ఈ మేరకు ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. నెలలో 4 రోజులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రభుత్వం చేసిన మంచి, పురోగతిని ప్రజలకు వివరించాలని ఆయన సూచనలు చేశారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో కనీసం నాలుగవ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదని, ఈ విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేలా నడుచుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఐఏఎస్ అధికారులు సైతం 2 రాత్రులు, 3 పగళ్లు ప్రజలతో మమేకమవ్వాలని సూచించినట్టు సమాచారం. పల్లెల్లో నిద్ర చేసి ఆయా గ్రామాల్లోని సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశంగా ఉంది.