AP Rains: ఏపీలో మళ్లీ వానల ఎఫెక్ట్ మొదలైంది. నెలరోజుల క్రితం అకాల వర్షాల ధాటికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంది. మళ్లీ వానలు కురుస్తుండగా, రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు వర్షం తీవ్రతను అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా వర్షాలపై కీలక ప్రకటన చేశారు.
రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. విచిత్రమైన వాతావరణ అంచనాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తాజాగా అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే 5వ తేదీ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు,మూడుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
Also Read: Heavy Rains in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇద్దరు మృతి
అయితే తాజాగా కురిసిన వర్షం ధాటికి కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 68.9మిమీ, ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2 మిమీ,ఎర్రగొండపాలెంలో 62 మిమీ, అన్నమయ్య జిల్లా ములకలచెరువులో 57.7మిమీ, నంద్యాల జిల్లా పెరుసోమల 43.2మిమీ, కృష్ణా జిల్లా ఆత్కూరులో 39మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కోన్నారు. 18 ప్రాంతాల్లో 20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైందన్నారు. అలాగే వైఎస్సార్(D) కమలాపురంలో 39.9°C, నంద్యాల(D) ఆళ్లగడ్డలో 39.8°C, అనకాపల్లి(D) వడ్డాదిలో 39.6°C, ఎన్టీఆర్ (D) చందర్లపాడులో 39.6°C, పల్నాడు(D) రవిపాడులో 39.5°C, ఏలూరు (D) రాజుపోతేపల్లిలో 39.4°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.