Telangana: ఉగాది పండుగతో తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. అన్ని భావోద్వేగాలు, కష్టసుఖాలను కలిసే జీవితాన్ని చూడాలని చెప్పడానికి తార్కాణంగా ఉగాది పచ్చను చెబుతారు. షడ్రుచులతో ఈ పచ్చడి తయారు చేసి అన్నిరకాల రుచులను సంతోషంగా ఆస్వాదిస్తుంటారు. ఏ ఒక్క రుచికి పరిమితం కావొద్దని, ఏ ఒక్కటి శాశ్వతం కాదనీ ఈ పచ్చడి వెల్లడిస్తుంది. ఎలాంటి ఫేజ్ అయినా అది పాస్ కావాల్సిందేననేది దీని అంతస్సూత్రం. ఇది అన్నింటికీ వర్తిస్తుంది. రాజకీయాలేమీ ఇందుకు అతీతం కాదు.
తెలంగాణ మటుకు ఈ పండుగ రెండు ఎన్నికలకు నడుమ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఈ గ్యాప్లో రాష్ట్రంలో రాజపీఠం మారింది. ఓడలు బండ్లు అవుతాయన్నట్టుగా పార్టీల స్థితిగతులు అనూహ్యంగా మారిపోయాయి.
Also Read: ప్రశాంత్ కిశోర్ ఇలా అయిపోయాడేంటీ?
అప్పుడు తీపి, అప్పుడే చేదు అన్నట్టుగా ఉండే ఉగాది పచ్చడి తరహా పరిస్థితులను తెలంగాణ రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. దాదాపు పదేళ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికలు చేదు రుచిని చూపించాయి. అదే కాంగ్రెస్కు మాత్రం తీపి కబురు మోసుకొచ్చాయి. తగిన మోతాదులో ఉంచాల్సిన ఉప్పు మాదిరి సీపీఐ కాంగ్రెస్కు తోడయ్యింది. ఇక గుంటూరు కారంలా బీజేపీ రోజు రోజుకు ఫైర్ బ్రాండ్లా తయారవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. లోక్ సభ ఎన్నికల్లో మరింత సెగలు కక్కేలా ఉన్నది. జలదరించే పులుపులా వైఎస్ఆర్టీపీ ఎగసిపడి ఎన్నికలకు ముందే మాయమైంది. వగరు రుచిని ఇచ్చే మామిడికాయ రంగులోని పచ్చటి ఎంఐఎం తన రుచిని అదే తీవ్రతతో కంటిన్యూ చేయనుంది. అసెంబ్లీ ఎన్నికలు ఒక దశ.. లోక్ సభ ఎన్నికలు మరో అడుగు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ రుచి తగలనుందో చూడాలంటే జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే.