అమరావతి, స్వేచ్ఛ: AP Govt on Temples: రాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై సీఎం చంద్రబాబు వద్దకు పూర్తిస్తాయి నివేదిక చేరింది. టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన సిఫార్సుల జాబితా ముఖ్యమంత్రి వద్దకు చేరినట్టు సమాచారం. మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లను నియమించనున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రంగం సిద్దమైంది.
సిద్ధమౌతున్న మార్కెట్ యార్డ్ కమిటీలు
వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు చంద్రబాబు పూర్తిస్థాయి కసరత్తును మొదలుపెట్టారు. ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీచేయనుంది.
Also read: YCP – I PAC: ఐప్యాక్ సేవలకు వైసీపీ గుడ్ బై? ముంచిందా? మించిందా?
ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసి లకు సమ న్యాయం జరిగేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలు సిద్దమౌతున్నాయి. మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి. రాష్ట్రం లో 222 మార్కెట్ కమిటీలు ఉండగా వీటన్నిటికీ చైర్మన్తో పాటు 15 మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. 50 శాతానికి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఆర్థిక శాఖపై సమీక్ష
రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. శనివారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్తో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also read: Posani Krishna Murali: పోసాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి? న్యూటర్న్ ఖాయమేనా?
కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి, సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలపగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా నిధులు తెచ్చుకోవాలని చంద్రబాబు తెలిపారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం https://epaper.swetchadaily.com/ఈ లింక్ని క్లిక్ చేయండి