Posani Krishana Murali: ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇద్దరు వైసీపీ నాయకులు పోసాని, వల్లభనేని వంశీల గురించి తెలిసిందే. ఇవాళ పోసానికి ఓ కేసులో బెయిల్ లభించగా, వంశీకి మాత్రం నిరాశ ఎదురైంది. కానీ ఇతర కేసులు కూడా ఉన్నందున పోసాని రిమాండ్ లో ఉండక తప్పదు. ఊరట లభించనందున వంశీ కూడ రిమాండ్ కొనసాగనుంది.
వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu Naidu), జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నారా లోకేష్(Nara Lokesh)లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి కేసుల పాలైన సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి శుక్రవారం బెయిల్ లభించింది. సీఐడీ కేసు(CID Case)లో ఆయనకు గుంటూరు కోర్టు(Guntur Court) బెయిల్(Bail) మంజూరు చేసింది. ఒక లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచికత్తు, దేశం విడిచిపెట్టి వెళ్లకూదనే షరతులు విధించింది. వారానికి రెండు సార్లు సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లాల్సిందిగా స్పష్టం చేసింది. పోసాని బెయిల్ పిటిషన్పై బుధవారమే వాదనలు ముగియగా, శుక్రవారం తీర్పు వెలువరించింది. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గుంటూరు సీఐడీ కోర్టులో పోసాని తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. కాగా, కోర్టు అనుమతి మేరకు గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయనను మంగళవారం కస్టడీలోకి తీసుకొని సీఐడీ పోలీసులు విచారించారు. సీఐడీ ఆఫీసులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రశ్నించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ ఫర్ ప్రొహిబిషన్ కోర్డు జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం తిరిగి గుంటూరు జిల్లా జైలుకి ఆయనను తరలించారు. ఆ కేసులో పోసాని బెయిల్ పిటిషన్పై బుధవారమే వాదనలు పూర్తవ్వగా, తీర్పు శుక్రవారానికి (మార్చి 21) కోర్టు వాయిదా వేసి షెడ్యూల్ ప్రకారం ప్రకటించింది. కాగా, ఫిబ్రవరి 26న పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆయనపై 19కి పైగా కేసులు నమోదవ్వగా, ఏదో కేసులో ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పలు కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ మిగతా కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైళ్లలోనే ఉండాల్సి వస్తోంది.
వంశీకి మరోసారి నిరాశ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 26 వరకు వాయిదా వేస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Vijayawada SC ST Court) నిర్ణయించింది. వంశీ బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల న్యాయవాదులు శుక్రవారం వాదనలు వినిపించారు. ఇదివరకే మూడు దఫాల వాదనలు పూర్తవ్వగా, శుక్రవారం మరోసారి వాదనలు జరిగాయి. ఈ కేసులో వంశీని అన్యాయంగా ఇరికించారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అనారోగ్య కారణాలతో వంశీ ఇబ్బంది పడుతున్నారని, నెలరోజులకు పైగా రిమాండ్లోనే ఉండడంతో బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కిడ్నాప్ కేసులో బాధితుడైన సత్యవర్ధన్ను భయపెట్టి, కిడ్నాప్ చేసిన వ్యవహారంలో పలు ఆధారాలు సేకరించారని, ఈ సమయంలో వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించడమో లేక భయపెట్టడమో చేస్తారని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. విదేశాలకు పారిపోయే ప్రమాదం కూడా ఉందని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని వంశీ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కోరారు. దీంతో, విచారణను మరోసారి వాయిదా వేస్తూ జడ్జి నిర్ణయించారు. దీంతో, వల్లభనేని వంశీ మరోసారి నిరాశకు గురయ్యారు.