YCP on TDP Alliance: అసెంబ్లీలో, కౌన్సిల్ లో ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలు(MLCs) కొట్టుకోవడం, తిట్టుకోవడం అదే.. వాద, ప్రతివాదాలు, వాగ్వాదాలు చేసుకోవడం మనందరికి తెలుసు. కానీ వాళ్లు సరదాగా ఆటలు ఆడి, సాంస్కృతిక కార్యక్రమాల్లో(Cultural Programs) పాల్గొని ఏకపాతాభ్రినయాలు చేసి ఎన్టీఆర్ లెవల్లో డైలాగులు చెప్తే ఎలా ఉంటుంది. ఈ ఐడియాను అమలు చేసి చూపించారు ఏపీ(AP)కి చెందిన ప్రజాప్రతినిధులు. ఇటీవల 15 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల ఆటల పోటీలు నిర్వహించారు.
ఎప్పుడూ మీసాలు మెలేస్తూ, తొడలు కొట్టుకుంటూ, సవాళ్లు విసురుకుంటూ కనిపించే నాయకులు కొంచెం ఆటవిడుపుగా బ్యాటు పట్టుకుని ఆడారు. కుర్చీలాటలో ఆరితేరిన వారు బంతాట కోసం బరిలో దిగారు. ప్రజా సమస్యలపై గొంతెత్తడమే కాదు అవసరమైతే కబడ్డీ కోర్టులో కూత పెట్టగలం అంటూ కబడ్డీ ఆడి చూపించారు. ఇక, ఆటల పోటీల ముగింపు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు కామెడీ స్కిట్ లు, ఏకపాత్రాభినయాలు చేసి చూపరులను మంత్రముగ్ధుల్ని చేశారు.
చంద్రబాబు విరగబడి నవ్విన వేళ
చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అంటేనే సీరియెస్ నెస్, సిరియెస్ వర్క్. అసలు యంత్రం మనిషి రూపమెత్తిందా అన్నట్లు ఉంటుంది ఆయన పనితీరు, ఎప్పుడో కానీ నవ్వని తీరు. దీనికి భిన్నంగా ఆయన పడి పడి నవ్విన దృశ్యం శుక్రవారం చోటుచేసుకుంది. నేతల పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది మరీ. ఇక పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) అయితే చిన్న పిల్లాడైపోయారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.
ముఖ్యంగా దుర్యోధనుడి గెటప్ వేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Raghu Ram Krishnam Raju).. ఏకపాత్రాభినయం చేసి అందర్నీ అలరించారు. ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ డైలాగు చెప్పి మెప్పించారు.
అలాగే జనసేన నేత కందుల దుర్గేశ్(Kandula Durgesh) బాల చంద్రుడి వేషధారణలో భారీ డైలాగులు చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన అభినయానికి వేదిక కింద ఆసీనులైన నేతలు చప్పట్లతో అభినందనలు తెలిపారు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు సహా పలువురు నేతలు కామెడీ స్కిట్లు వేసి అలరించారు.
విజయవాడలో జరిగిన ఈ ప్రజాప్రతినిధుల సాంస్కృతిక ప్రదర్శనలు చూసి ఆ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి నారా లోకేష్ మనసారా నవ్వుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించారు. కార్యక్రమం ఆద్యంతం బాగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజా సమస్యల్తో బిజీగా ఉండే నేతలు ఇలా సరదాగా నవ్వుతూ కాలేజీ రోజులకు వెళ్లినట్లుగా ఫిలై ఓ పూట ఆటవిడుపుగా గడిపారు.
అయితే.. దీనిపై వైసీపీ మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తోంది. కూటమి నేతల డ్రామాలు బాగున్నాయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. నేతలు చేసిన ప్రోగ్రాం.. జబర్ధస్త్ కామెడీ షోలా ఉందని కొందరు విమర్శిస్తుండగా, ప్రజల సమస్యలు గాలి కొదిలేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్లు అంటూ వ్యగ్యంగా పోస్టులు పెడుతున్నారు.
ఇవన్నీ పట్టని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాత్రం.. భళా! మా నాయకుల ప్రతిభ. మా డిప్యూటీ స్పీకర్ గద పట్టిన తీరు భళా. మా టూరిజం మినిస్టర్ ఆ డైలాగు చెప్పిన స్టైలు భళా! అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.