– ప్రభుత్వానికి డీఎస్పీ గంగాధర్ మరో ఫిర్యాదు
– ఈసారి స్టీఫెన్ రవీంద్ర టార్గెట్
– ఎంక్వైరీ లేకుండా తనను గతంలో సస్పెండ్ చేయడంపై అభ్యంతరం
– ప్రమోషన్కు అడ్డుపడ్డారని వివరణ
– గతంలో ప్రణీత్ రావు ప్రమోషన్పైనా ఫిర్యాదు చేసిన గంగాధర్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. రోజుకో కొత్త విషయం బయటపడుతుండడంతో ఈ వ్యవహారం మరింత ఇంట్రస్టింగ్గా మారుతోంది. ఈ క్రమంలోనే పోలీసుల మధ్య పంచాయితీలు వెలుగు చూస్తున్నాయి. కాలేజీలో సీనియర్, జూనియర్ల మాదిరి గొడవల్లానే, మరింత ఘాటుగా పోలీసుల మధ్య గతంలో జరిగిన వివాదాలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
స్టీఫెన్ రవీంద్రపై సీఎంకు ఫిర్యాదు
ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నారు స్టీఫెన్ రవీంద్ర. గతంలో సైబరాబాద్ సీపీగా పని చేశారు. అయితే, స్టీఫెన్ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాజాగా ఫిర్యాదు అందింది. డీఎస్పీ గంగాధర్ ఈ కంప్లయింట్ చేశారు. సీఎంతో పాటు చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీఓపీటీకి కూడా ఫిర్యాదు కాపీ పంపారు. ఓ భూ వివాదంలో తాను తలదూర్చానంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే సస్పెండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు గంగాధర్. భూ కబ్జాదారులతో చేయి కలిపి తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. అప్పటి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆదేశానుసారంగానే తను కేసు నమోదు చేస్తే ల్యాండ్ గ్రాబర్స్పై కేసు నమోదు చేసినందుకు సస్పెండ్ చేశారని వాపోయారు గంగాధర్.
అసలీ వివాదం ఏంటి..?
శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 68, కొల్లూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 278లలో గ్రామాల మధ్య ఓవర్ లాప్ భూ వివాదం కేసులు నమోదయ్యాయి. ఈ కారణంగానే తనను సస్పెండ్ చేశారని అంటున్నారు గంగాధర్. ల్యాండ్ గ్రాబర్స్కి సపోర్ట్ చేస్తూ తనపై వేటు వేయడంతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సస్పెండ్ అయిన అధికారులపై మూడు నుంచి ఆరు నెలల లోపు డిసిప్లీనరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలనే జీఓ ఉంది. దీంతో తన బ్యాచ్ ఇన్స్పెక్టర్లంతా డీఎస్పీలుగా ప్రమోషన్స్ పొందినా తనకు మాత్రం రాలేదని సీఎంకు వివరించారు గంగాధర్. స్టీఫెన్ రవీంద్ర ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడంతో కమిటీ తనకు ప్రమోషన్ ఇవ్వలేదన్నారు. తన ప్రమోషన్ని కన్సిడర్ చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా స్టీఫెన్ రవీంద్ర లెక్కచేయలేదని వాపోయారు. హైకోర్టు మరోసారి స్టీఫెన్ రవీంద్రకు నోటీసులు పంపడంతో ఆయన డిసిప్లీనరీ యాక్షన్ కమిటీకి రిపోర్ట్ పంపడంతో తనకు లేట్గా ప్రమోషన్ వచ్చిందని, రవీంద్ర చాలామంది కిందిస్థాయి పోలీస్ అధికారులను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని వివరించారు గంగాధర్.
ఆమధ్య ప్రణీత్ రావుపైనా ఫిర్యాదు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా కనిపిస్తున్నారు ప్రణీత్ రావు. ఆయన నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగా పోలీస్ శాఖలో కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. అయితే, ప్రణీత్ రావు పోస్టింగ్పైనా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదే క్రమంలో డీఎస్పీ గంగాధర్ రాష్ట్ర ప్రభుత్వానికి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ శాఖలో నలుగురు అధికారులు అడ్డదారిలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్ పొందారని తెలిపారు. ఆ నలుగురిలో ప్రణీత్ రావు ఒకరని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మావోయిస్టులకు సంబంధించిన ఆపరేషన్స్లో కీలకంగా వ్యవహరించే వారికే యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఉంటుందని, కానీ, ప్రణీత్ ఎలాంటి నక్సల్ ఆపరేషన్లో పాల్గొనకపోయినా ప్రమోషన్ ఇచ్చారని చెప్పారు. అడ్డదారిలో డీఎస్పీ అయినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ తనకు కావాల్సిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్స్ ఇచ్చిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై చర్చ సాగుతుండగానే, తాజాగా స్టీఫెన్ రవీంద్రపై గంగాధర్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది.