అమరావతి, స్వేచ్ఛ: AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు, వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఏపీ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్, రెగ్యులేషన్ యాక్డ్- 2025 డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
దీంతో ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లకు సర్కార్ వర్తింపజేయనుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు, పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఎస్..సీ వర్గీకరణ నివేదికకు గ్రీన్ సిగ్నల్!
సీఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూములు కేటాయింపునకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో ఎన్- 10 నుంచి ఎన్ 13 వరకు E1 జంక్షన్ నుంచి సీఆర్డీఏ సరిహద్దుల వరకు రూ. 1082 కోట్లతో 400 కేవీడీసీ లైన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎస్సీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో కీలక చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా, ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని యూనిట్గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో జిల్లాను యూనిట్గా వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపై చర్చించింది. ఈ నేపథ్యంలోనే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా వర్గీకరణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది.
అయితే 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్గా వర్గీకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని, దీంతోపాటు బుడగజంగాలు, మరో కులాన్ని ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
వైఎస్ కాదు.. వైఎస్సార్ కడప
వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో కడప జిల్లా పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా వైసీపీ హయాంలో మార్చింది. ఈ కేబినెట్ భేటీలో వైఎస్ఆర్ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా రోజులుగా దీనిపై ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది.
మరోవైపు బుడమేరు డివిజన్కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు పరిపాలన అనుమతి జారీకి మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీలో స్టార్ట్ అప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఏర్పాటుకు, ఏపీ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0కు కేబినెట్ ఓకే చెప్పింది. కేబినెట్ నిర్ణయాల అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ విమర్శలపై కూడా చర్చ జరిగింది.
నాగబాబుకు ఏ శాఖ ఇద్దాం?
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం చంద్రబాబు ఛాంబర్కి వెళ్లారు. సీఎంతో ప్రత్యేకంగా సుమారు 45 నిమిషాలపాటు పలు విషయాలపై ప్రత్యేకంగా చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, నాగబాబు మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోవాలి? ఏ శాఖ ఇవ్వాలి? ఏ శాఖ ఇస్తే మంచిది? అనేదానిపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం.
Also Read: Hyderabad News: వెళ్తున్న కారులో మంటలు.. షార్ట్ సర్క్యూట్ కారణమా?
దీంతో పాటు పిఠాపురం ఆవిర్భావ సభ, నేతలు చేసిన కామెంట్స్ పైన చర్చ జరిగిందని తెలుస్తున్నది. ముఖ్యంగా పిఠాపురం వర్మకు ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై పవన్ కళ్యాణ్ గుర్తు చేసి మరీ మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. నేడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటను వెళ్తున్నారు. ఈ సందర్భంగా పర్యటన విషయాలు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తున్నది.
నేడు ఢిల్లీకి బాబు..
సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు సహా అనేక ఆర్ధిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తున్న సంగతి తెలిసిందే. రెండు ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి.
దీంతో పాటు అమరావతిలో నిర్మాణాలకు కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. మరోవైపు అమరావతి నిర్మాణాల కోసం సీఆర్డీఏ ఆమోదించిన టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపింది. ఈ క్రమంలోనే అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోదీని అహ్వానించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
సీఎంను కలిసిన సిద్ధార్థ్
సీఎం చంద్రబాబును ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల అనే బాలుడు కలిశాడు. ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేందుకు ఏఐ సాయంతో సిర్కాడియావీ యాప్ను సిద్ధార్థ్ ఇటీవల రూపొందించాడు. స్మార్ట్ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. సిద్ధార్థ్ను కలిసేందుకు ఆహ్వానించారు. సిద్ధార్థ్ ప్రొఫైల్ తెలుసుకుని అభినందించారు.
దాదాపు అరగంట పాటు అతనితో సీఎం ముచ్చటించారు. వైద్యం రంగంలో సేవలందించేలా ఆవిష్కరణలు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడూ కలలు కంటుంటానని, వాటిని సిద్ధార్థ్లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిస్తాయని అన్నారు. ఏఐలో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం https://epaper.swetchadaily.com/l లింక్ క్లిక్ చేయండి