Tariff Cuts: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ప్రతీకార సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ మిత్ర దేశాలను సైతం ఆయన వదలడం లేదు. ఈ క్రమంలో భారత్ తో సన్నిహిత సంబంధాలను సైతం పక్కన పెట్టి ఆ దేశంపై పన్నులు విధించనున్నట్లు అధికార పీఠం ఎక్కిన వెంటనే ట్రంప్ ప్రకటించారు. ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ లో మాట్లాడుతూ భారత్ పై విధించిన టారిఫ్స్.. ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే టారిఫ్స్ పై మరోమారు మాట్లాడిన ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించినట్లు వెల్లడించారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం.. ఆసక్తికర ప్రకటన చేసింది.
‘ఎలాంటి హామీ ఇవ్వలేదు’
అమెరికాపై సుంకాల తగ్గించేందుకు భారత్ (Indian Government) అంగీకరించిందన్న అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించింది. సుంకాల తగ్గింపు విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అధ్యక్షుడు ట్రంప్ పదే పదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) సెప్టెంబర్ వరకూ సమయం కోరినట్లు పార్లమెంటు ప్యానెల్ (Parliamentary panel) కు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమవుతోంది. అమెరికాపై భారత్ విధిస్తున్న పన్నుల విషయంలో కేంద్రం ప్రస్తుతానికి ఎలాంటి వైఖరి ఎంచుకోలేదని అర్థమవుతోంది.
Also Read: Cyber Fraud Cafe Trapping: థాయిలాండ్ లో ఘోరం.. కరెంట్ షాకిచ్చి 540 మంది భారతీయులకు నరకం
సర్దుబాట్లు అవసరం
భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై కామర్స్ సెక్రటరీ సునీల్ భర్త్వాల్ (Sunil Barthwal) తాజాగా స్పందించారు. పరస్పరం ఆమోదయోగ్యమైన వాణిజ్య ఒప్పందం (Trade Agreement) కోసం ఇరుదేశాలు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సుంకాల విషయంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకొని దీర్ఘకాలిక వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసే విధంగా ఇరు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ (PM Modi) సైతం అక్కడ ట్రంప్ తో పాటు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్ – అమెరికా.. పరస్పరం అంగీకారమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే కుదుర్చుకుంటాయని తెలియజేశారు.