Mahakumbh : మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. మహా శివరాత్రి (Shivratri) రోజుతో మహాకుంభమేళా ముగుస్తోంది. దీంతో శివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. దాంతో ఈ ఒక్కరోజే 81 లక్షల మంది దాకా స్నానాలు ఆచరించారు. గత 45 రోజులుగా సాగుతున్న ఈ కుంభమేళాలో ఇప్పటి వరకు 62 కోట్ల మందికి పైగా స్నానాలు చేయడం విశేషం. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్దనే ఎక్కువగా స్నానాలు ఆచరించారు.
ఎంతో అట్టహాసంగా సాగిన ఈ మహా వేడుక నేటితో ముగిసింది. ప్రతి రోజూ దాదాపు కోటి మందికి పైగానే పుణ్యస్నానాలు చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక శివరాత్రి రోజు త్రివేణి సంగమం మొత్తం హరహర మహాదేవ్ నినాదాలతో హోరెత్తింది. పుణ్య స్నానాలు చేసిన వారంతా గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని రోజుల్లో స్నానం చేయడం కన్నా శివరాత్రి రోజు చేయడమే అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తున్నారు. మహా కుంభమేళాలో సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు స్నానాలు చేశారు.