UAE: ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా జిల్లాకు చెందిన మహిళకు యూఏఈ ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేసింది. భారత మహిళ షెహజాది ఖాన్ ను ఫిబ్రవరి 15నే ఉరితీసినట్లు భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. తమ కుమార్తెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేసిన అన్ని ఫలితాలు విఫలం కావడంతో షెహజాది ఖాన్ కు మరణం తప్పలేదు.
ఉరిశిక్ష ఎందుకంటే
యూపీలోని బాందా జిల్లా ముగ్లి గ్రామానికి చెందిన షెహజాదిని.. 2021లో ఉజైర్ అనే వ్యక్తి యూఏఈ తీసుకెళ్తానని చెప్పి తన బంధువులైన ఫైజ్-నాడియా దంపతులకు అమ్మేశాడు. దీంతో వారు షెహజాదిని అబుదాబీకి తీసుకెళ్లారు. అక్కడ తమ బిడ్డ బాగోగులను చూసుకునే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఈ క్రమంలో అనుకోకుండా ఆ బిడ్డ చనిపోయింది. దీంతో షెహజాదినే తన బిడ్డను చంపిందంటూ ఫైజ్-నాడియా దంపతులు కేసు పెట్టారు. బిడ్డకు ఇచ్చే మాత్రల విషయంలో షెహజాది నిర్లక్ష్యం వ్యవహరించిందని అక్కడి పోలీసులు నిర్ధారించారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది.
Also Read: Ram Mandir: రామమందిరంపై భారీ ఉగ్ర కుట్ర.. గ్రెనేడ్లతో దొరికిన టెర్రరిస్టు
చివరి కోరికగా ఫోన్ కాల్
ఉరిశిక్షను అడ్డుకోవాలంటూ షెహజాది తల్లిదండ్రులు భారత్ లో అధికారులను ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో న్యాయపోరాటనికి దిగారు. ఈ క్రమంలో బాధితురాలి గురించి ధర్మాసనం ప్రశ్నించగా ఫిబ్రవరి 16నే ఆమెను ఉరితీసినట్లు భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. కాగా అక్కడి జైలు అధికారులు షెహజాది చివరి కోరిక ఏమిటని అడగ్గా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడతానని ఆమె అభ్యర్థించింది. దీంతో యూపీలోని ఆమె కుటుంబ సభ్యులతో వారు మాట్లాడించారు. ఆ సందర్భంలోనూ తాను ఏ తప్పు చేయలేదని షెహజాది కన్నీటిపర్యంతమైంది. ఉరిశిక్షకు కొద్ది నిమిషాలే ఉన్నప్పటికీ తనను ఎలాగైన రక్షించమని కుటుంబ సభ్యులను ప్రాధేయపడింది. అయినప్పటికీ ఆమెకు ఉరిశిక్ష తప్పలేదు.