TPCC Mahesh Kumar Goud: హైదరాబాద్ గాంధీ భవన్ లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేంపల్లి నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీల ఆలస్యం వల్ల కార్యకర్తల్లో నైరాశ్యం చెందిన మాట వాస్తవమని అంగీకరించారు. త్వరలోనే అర్హతల ప్రకారం పదవులు ఇస్తామని నేతలకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో 17 నెలల కాంగ్రెస్ పాలనతో పాటు.. ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల ఫలితాలు.. ఎమ్మెల్యేలపై ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan).. తెలంగాణ ఇంచార్జ్గా రావడం అందరీ అదృష్టమన్న మహేష్ గౌడ్.. చురుకైన నాయకుల్ని పీసీసీ అబ్జర్వర్లతో గుర్తించి తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read: AICC Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు కొత్త చిక్కులు.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పైనే ఫిర్యాదులు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేతలు, కార్యకర్తలపైనే ఉందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కార్యకర్తలు – నాయకులు ప్రజలతో అనుసంధానంగా పని చేయాలని సూచించారు. పార్టీకి ప్రభుత్వానికి నాయకులు వారధి కావాలని పేర్కొన్నారు. సీనియర్, జూనియర్ల సమన్వయంతో పని చేయాలని అన్నారు. కులసర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, భూ భారతి పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని చెప్పుకొచ్చారు. దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు.