Banakacherla Project: ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ఏ రూపంలో నిర్మించాలనుకున్న ప్రతిఘటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)కు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు తెలంగాణ(Telangana)కు నష్టమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తు పెంపునకు అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్(CR Patil)తో మంగళవారం భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, జల్ శక్తి మినిస్ట్రీలో తెలంగాణకు చెందిన అంశాలు పెండింగ్లో ఉన్నాయని కేంద్రమంత్రిగా చొరవ చూపి వాటిని త్వరగా పరిష్కరించాలని కోరానన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు మొత్తం 90 టీఎంసీల నీటి కేటాయింపు చేయాలని, వాటిల్లో 45 టీఎంసీల నీటిని వెంటనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వాలి
‘గోదావరి జలాల్లో.. సమ్మక్క- సారక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను సబ్మిట్ చేశామని, సీడబ్ల్యూసీకి అనేక సందర్భాల్లో వారు అడిగిన వివరాలు ఇచ్చామన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని క్లియరెన్స్లు ఇవ్వాలని కోరారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ (కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-–2) ఏపీ, తెలంగాణ మధ్య 811 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు డివైడ్ చేయాలని, దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఆలస్యంగా వెళ్తున్నాయని చొరవ చూపి జస్టిస్ బ్రిజేష్ను రిక్వెస్ట్ చేసి ఈ ప్రొసీడింగ్స్ను వేగవంతంగా ఫైనలైజేషన్ చేయించాలని కోరారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ అన్యాయం
ఆంధ్రప్రదేశ్ పోలవరం-– బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్ను సబ్మిట్ చేసిందని, దాన్ని మేము వ్యతిరేకించామన్నారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. ఆల్మట్టి డ్యాం 519 మీటర్ల కంటే ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టులో స్టే ఉందని, ఈ స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్ తీర్మాణం చేసి, జీవో ఇచ్చి ఎత్తు పెంచడానికి భూసేకరణ కోసం ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, ఇది చట్ట వ్యతిరేకం అన్నారు. కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా కర్ణాటక ప్రభుత్వానికి చెప్పాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే.. తెలంగాణ అన్యాయం జరుగుతుందని, అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. గత 22 నెలల నుంచి కేంద్ర ఫండింగ్ ఇరిగేషన్ కోసం అడిగా మన్నారు. దేవాదుల ప్రాజెక్టు మినహా.. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామని, కేంద్ర నిబంధనల ప్రకారం మేము కొన్ని ప్రాజెక్టులను లిస్టవుట్ చేశామని, వాటికి సీడబ్ల్యూసీ నుంచి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇప్పించాలని కోరారు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు-– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదికుంట వాగు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అడిగినట్లు వెల్లడించారు.
కృష్ణా నది నీటిని ఎక్కువ డైవర్ట్ చేయొద్దు
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా నది నీటిని ఎవరూ ఎక్కువ డైవర్ట్ చేయొద్దని, దుర్వినియోగం చేయొద్దని, దీనిపై కేఆర్ఎంబీకి అధికారం ఇచ్చారన్నారు. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, తాను కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి, కేఆర్ఎంబీకి నిధులు ఇచ్చి టెలిమెట్రీ స్టేషన్ ఇన్స్టాలేషన్లలో కొంత ప్రోగ్రెస్ తీసుకొచ్చామన్నారు. ఫేజ్–1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్లు ఇన్స్టాల్ అయ్యాయన్నారు. ఫేజ్-–2 కింద మరో 9 చేయాల్సి ఉందన్నారు. ఫేజ్-–3 కింద 11 టెలిమెట్రీ స్టేషన్ ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉందని, ఫేజ్–-2, ఫేజ్–-3కి సంబంధించి కేఆర్ఎంబీకి ఆదేశాలు ఇచ్చి వేగవంతంగా పూర్తి చేయాలని కోరామన్నారు. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత కృష్ణా నది నీటిని వాడుకుంటుందో స్పష్టంగా తెలుస్తుందని చెప్పామన్నారు. అంతర్రాష్ట్ర వివాదాలు తగ్గుతాయని కేంద్రమంత్రికి వివరించామని, వెంటనే స్పందించిన కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కేఆర్ఎంబీకి, ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తామని చెప్పారన్నారు.
సీడబ్ల్యూసీ చైర్మన్తోనూ భేటీ
ఢిల్లీలో మంగళవారం సీడబ్ల్యూసీ చైర్మన్తో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అత్యంత వెనుకబడ్డ జిల్లాలో ఉందన్నారు. 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వెంటనే కేటాయించాలని కోరారు. ట్రైబ్యునల్ కేటాయింపు కోసం చూడకుండా.. మైనర్ ఇరిగేషన్ కోసం 45 టీఎంసీల నీరు కేటాయించాలన్నారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు టీఏసీ, ఐటీసీ అనుమతులు ఇవ్వాలని, తెలంగాణ––ఆంధ్రా మధ్య కృష్ణా నీటి పంపకాలు ట్రైబ్యునల్ ద్వారా త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం.. గోదావరి వరద జలాలు వినియోగం సాధ్యం కాదు.. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్కి తెలిపామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు పీఎంకేఎస్వై కింద 2026– 2031 వరకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారని, టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు ఏపీ ముందుకు రాకపోతే.. తామే పూర్తి నిధులు వెచ్చిస్తామని స్పష్టం చేశారు. ఏపీ టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వడం లేదన్నారు.
Also Read: Indiramma Sarees: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం..!
