GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కారుణ్య నియామకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఒకరి కన్నా ఎక్కువ మందికి జీహెచ్ఎంసీలో ఉద్యోగం కల్గి ఉండరాదన్న నిబంధనను తుంగలో తొక్కుతూ కొందరు ఉద్యోగులు అధికారులకు లంచాలిచ్చి, అడ్డదారిలో కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు దక్కించుకున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో ఒక్కో సర్కిల్ లో డబుల్ డిజిట్లో ఈ రకంగా ఉద్యోగాల్లో చేరిన వారున్నట్లు సమాచారం. మొత్తం 30 సర్కిళ్లలో 50 నుంచి 60 మంది అడ్డదారిలో ఉద్యోగాలు దక్కించుకున్నట్లు సమాచారం. ఇలాంటి ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపు ఖజానాకు భారంగా మారి రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ చెల్లించలేకపోతున్నారు. వీరిపై ఇప్పటి వరకు వందల సంఖ్యల్లో ఫిర్యాదులొచ్చినా, ఎప్పటికపుడు విచారణ పేరిట అధికారులు జాప్యం చేస్తూ వీరిని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
తప్పుుడు అఫిడెవిట్లతో కారుణ్య నియామకాలు
ఇలాంటి ఉద్యోగులు సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్ జోన్లలో ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. సర్కిల్-14లో 2012లో జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తూ ఓ ఉద్యోగి మృతి చెందారు. అప్పటికే ఆయన భార్య కూడా జీహెచ్ఎంసీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఆమె జీహెచ్ఎంసీలోనే ఉద్యోగం చేస్తున్న విషయాన్ని దాచిన ఆయన కుమారుడు, తన కుటుంబంలో ఎవరికి సర్కారు నౌకరి లేదంటూ తప్పుడు అఫిడెవిట్ సమర్పించి ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. వీరిలో ఓ ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి (దాదాపు 12 ఏళ్ల నుంచి ) ఎలాంటి బదిలీలు లేకుండా విధుల్లో చేరిన స్థానంలోనే కొనసాగుతున్నారు. తప్పుుడు అఫిడెవిట్లతో కారుణ్య నియామకాలు జరిగిన విషయం నాలుగేళ్ల తర్వాత బయటకు పొక్కటంతో ఓ యూనియన్ నేతలు రంగంలో దిగి, ఈ రకంగా ఉద్యోగాలు పొందిన వారి వివరాల్ని బయటకు తీశారు. దీంతో సదరు ఉద్యోగి తల్లి కూడా జీహెచ్ఎంసీలోనే విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించటంతో ఆమె కు రిటైర్డు సమయంలో రావల్సిన బెనిఫిట్స్ చెల్లింపులను నిలిపేశారు. సదరు ఉద్యోగిణి నేటికీ తన బెనిఫిట్స్ కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. తన కొడుకు తనను సరిగ్గా చూడటం లేదని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి, తన బెనిఫిట్స్ తనకు చెల్లించాలని కూడా అధికారులను ప్రాధేయపడినట్లు కూడా తెలిసింది.
Also Read: AICC Meenakshi Natarajan: నియోజకవర్గాల్లో సమన్వయ సమస్య.. మీనాక్షి నటరాజన్ సీరియస్
ఏళ్లుగా కొన సాగు తున్న విచారణలు
30 సర్కిళ్లలో దాదాపు 50 నుంచి 60 మంది ఇదే రకంగా తప్పుుడ అఫిడెవిట్లు సమర్పించి ఉద్యోగాలు దక్కించుకున్నట్లు గుర్తించి, వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు వారిని విధుల్లో నుంచి తొలగించి, అప్పటి వరకు పొందిన అన్ని రకాల ప్రయోజనాలను రికవరీ చేయాలంటూ నేరుగా అడ్మిన్ సెక్షన్లో ఫిర్యాదులు చేశారు. దీంతో వెంటనే స్పందించిన అడ్మిన్ సెక్షన్ ఈ వ్యవహారంపై విచారణాధికారులుగా అన్ని సర్కిళ్ల మెడికల్ ఆఫీసర్లను, డిప్యూటీ కమిషనర్లను నియమించింది. ఈ వ్యవహారంపై ఖైరతాబాద్, సికిందరాబాద్, చార్మినార్ జోన్లలోని వివిధ సర్కిళ్లకు చెందిన అధికారులు విచారణ నిర్వహించి, తప్పుడు అఫిడెవిట్లు సమర్పించి ఉద్యోగాలు దక్కించుకున్న విషయం వాస్తవమేనని ధృవీకరించి, నివేదికలను సమర్పించి దశాబ్దం కాలం గడుస్తున్నా, ఇప్పటి వరకు ఆ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఫేక్ ఉద్యోగులపై కఠిన చర్యలు
ఈ వ్యవహారం చర్చకు వచ్చినపుడల్లా సదరు ఉద్యోగులు విచారణాధికారులను మేనేజ్ చేసుకుని నేటికీ ఆ ఉద్యోగాల్లోనే కొనసాగుతున్నారు. ఓ సందర్భంగా విచారణాధికారులకు లంచాలిచ్చే ప్రయత్నం చేసి కూడా పట్టుబడిన ఫేక్ ఉద్యోగులపై కఠిన చర్యలెందుకు తీసుకోవటం లేదని పలు యూనియన్ల నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారులను తప్పుుదోవ పట్టించి, అబద్దాలు చెప్పి, తప్పుడు అఫిడెవిట్లతో ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రస్తుతం నెలకు రూ. 60 వేల నుంచి రూ. 80 వేల మధ్య జీతాలు తీసుకుంటున్నట్లు సమాచారం. గడిచిన 12 ఏళ్ల నుంచి జీహెచ్ఎంసీ అడ్డదారిలో విధుల్లో చేరిన ఈ ఉద్యోగులపై ఇప్పటికైనా తగిన విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకుంటే ఆర్థికంగా కుదేలైన జీహెచ్ఎంసీ ఖజానాకు కొంత మేరకైనా ఊరట కల్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Zipline Mishap: పాపం పదేళ్ల బాలిక.. 30 అడుగుల ఎత్తు నుంచి..