Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు మరో రెండురోజుల్లో ముగియనున్నాయి. ఈ నెల 31న మిస్ వరల్డ్ ఎవరో తేలనుంది. కీరిటం ఏ దేశం కైవసం చేసుకోబోతుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ హైటెక్స్ లోని నాలుగో హాల్లో ఈ నెల 31వ తేదీన గ్రాండ్ ఫినాలే పోటీలు నిర్వహిస్తున్నారు. అందాల పోటీలు అర్ధరాత్రి వరకు జరగనున్నాయి. పర్యాటక శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 109 దేశాల నుంచి అందాలభామలు, విదేశీ మీడియా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖలు, రాజకీయ నేతలు ఈవెంట్లో పాల్గొననుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే వారికి ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఎలాంటి పొరపాట్లకు తావ్వికుండా చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. హైటెక్స్లో 3 వేల నుంచి 4,500 మంది సామర్థ్యంతో కొత్తగా హాల్ నిర్మించగా.. ఈ మేరకు గెస్ట్లను ఆహ్వానిస్తున్నారు. హాల్ కెపాసిటీ, ప్రసుత్త పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్ పోటీలకు 3000 మందికి మాత్రమే పాసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 1,500 పాసులు మిస్వరల్డ్ నిర్వాహకులు, 1500 పాసులు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్అవకాశం కల్పించగా.. దాదాపు 10 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఇందులో 500 నుంచి 1000 మందిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
Also Read: CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం.. సీఎం సంచలన వాఖ్యలు!
పోటీల ప్రత్యక్ష ప్రసారాల సోనీ టీవీ ద్వారా టెలికాస్ట్ కానున్నాయి. ఫైనల్ పోటీలు దాదాపు 150 దేశాల్లో లైవ్టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో తెలంగాణ సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై విస్తృతంగా ప్రసారం చేసేలా ప్లాన్ చేశారు. తుది పోటీల్లో వ్యవహరించనున్న న్యాయ నిర్ణేతలు, మిస్వరల్డ్ పోటీలకు ఎంపికైన వారి వివరాలను నేడో, రేపో మిస్ వరల్డ్ నిర్వాహకులు ప్రకటించనున్నట్లు సమాచారం. ఫైనల్స్ ప్రోగాంకు సంబంధించిన షెడ్యూల్ కొలిక్కిరాగా, ఫైనల్ కోసం అందాల భామలు బుధవారం రిహార్సల్స్ ప్రారంభించారు. ఈ రిహార్సల్స్ శనివారం ఉదయం వరకు కొనసాగనున్నట్లు తెలిసింది.
ప్రాథమిక పోటీల తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్కు ఒక్కో ఖండం నుంచి 10 మంది (అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మంది)ని ఎంపికయ్యారు. గత ఆదివారం మొదటి దశ క్వార్టర్స్ పోటీలు ముగియగా.. ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున 40 మందిని ఎంపిక చేశారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి రెండో దశలో ఐదుగురిని (టాప్ 5) ఎంపిక చేశారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఐదుగురిలో మూడో దశలో ఇద్దరిని (టాప్ 2)ను ఎంపిక చేశారు. అంటే పోటీలో 8 మంది నిలిచారు.’
Also Read: Jeedimetla police: మావోయిస్టుల పేర బెదిరింపు లేఖ.. ఇద్దరు నిందితుల అరెస్ట్!
ఈ ఎనిమిది మందిలో సెమీ ఫైనల్లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్గా ఎంపిక చేశారు. అలా ప్రతి ఖండం నుంచి మిగిలిన ఒక్కరి మధ్య ఫైనల్ పోటీ జరగనున్నది. ప్రస్తుతం ఫైనల్ బరిలో నిలిచిన నలుగురిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా, యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సెల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టినిక్కు చెందిన ఆరెలీ జోచిమ్లు ఎంపికైనట్లు సమాచారం. తుది పోటీ (ఫైనల్స్)లో పాల్గొనేది ఈ నలుగురే. వీరిలో ఒకరు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటారు. మిగిలిన ముగ్గురిని ప్రతిభను బట్టి రన్నరప్లుగా ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ కిరీటం విజేతకు భారీ ప్రైజ్ మనీతోపాటు అంతర్జాతీయ కీర్తి, ప్రపంచ వేదికపై సామాజిక ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా, ప్రైజ్ మనీ భారతీయ రూపాయల్లో దాదాపు రూ.8.5 కోట్లకు పైగా ఉంటుంది.