Indiramma Amrutham schem: ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి పోషకాలు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. ‘ఇందిరమ్మ అమృతం’ పథకంను ప్రవేశపెడుతుంది. పైలట్ ప్రాజెక్టులుగా భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసింది. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఒక్కో బాలికలకు నెలకు 30 చిక్కిలు ఇవ్వనున్నారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణ ను నిర్మిద్దాం అనే నినాదంతో పథకాన్ని రూపొందించారు.
ఇందిరమ్మ అమృతం
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్నది. ‘ఇందిరమ్మ అమృతం’ పేరుతో 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల కౌమార బాలికల రక్తహీనత సమస్యను పరిష్కరించే దిశలో కొత్త పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకం ద్వారా, పైలట్ ప్రాజెక్టు లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కిలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా కౌమార బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఒక్కో బాలికకు నెలకు 30 చిక్కిలు – ప్రతి రోజూ ఒకటి చొప్పున అందజేస్తారు. ఒక్కో చిక్కిలో సుమారు 600 కేలరీలు, 18–20 గ్రాముల ప్రోటీన్తో పాటు అవసరమైన మైక్రో న్యూట్రియెంట్లు ఉంటాయి. 15 చిక్కిల చొప్పున, నెలకు రెండు సార్లు అంగన్వాడి కేంద్రాల్లో కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం ను అందజేస్తారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం, తెలంగాణలో 64.7% కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఇందిరమ్మ అమృతం పథకాన్ని రూపొందించారు. బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు హిమోగ్లోబిన్ (హెచ్బీ) పరీక్షలు నిర్వహించి ఆరోగ్య శాఖ ద్వారా ఐరన్ , ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందజేయనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- సెర్ప్ సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. రక్తహీనత తగ్గింపు తో పాటు అంగన్వాడి కేంద్రాల్లో కౌమార బాలికలకు పోషకాహార చైతన్యం,బాల్య వివాహాలపై అవగాహన, ఆరోగ్యం, పరిశుభ్రతపై మహిళా శిశు సంక్షేమ శాఖ అవగాహన కల్పించనున్నారు. దీంతోపాటు కౌమార బాలికలకు నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపడనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో ఇందిరమ్మ అమృతం పథకాన్ని గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలిపారు.
Also Read: Sr NTR Birth Anniversary: ఎన్టీఆర్కు సీఎం చంద్రబాబు, తారక్ ఘన నివాళులు.. వీడియోలు వైరల్
జిల్లాలో లబ్దిదారుల సంఖ్యను అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో 23,399 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 18,230మంది, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలో 8,640 మంది మొత్తం ఈ మూడు జిల్లాల్లో 50,269 మంది కౌమార బాలికలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరందరికి ప్రతి 15 రోజులకు ఒకసారి అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిక్కిల ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం కౌమార బాలికల ఆరోగ్యం, సంక్షేమం, సంరక్షణకు ముందడుగుగా నిలవనుంది.
గ్రామీణ బాలికల ఆరోగ్య పరిరక్షణకు కృషి- మంత్రి సీతక్క
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేస్తున్నాం. మారుతున్న ఆహార అలవాట్లు, జీవన శైలిలో వస్తున్న మార్పులు, ఇతర ఆరోగ్యకారణాలతో మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. కౌమార దశ నుంచే రక్తహీనతను తగ్గించేందుకు ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ఆరోగ్య సంరక్షణ, స్వీయ భద్రతపై అవగాహన పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకాన్ని మొదటి దశలో రక్తహీనత శాతం అత్యధికంగా నమోదైన మూడు జిల్లాల్లో అమలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా, పథకాన్ని ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల ఆరోగ్య పరిరక్షణలో ‘ఇందిరమ్మ అమృతం’ కీలకంగా నిలవనుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో కౌమార బాలికలు భాగస్వాములుకావాలి.
Also Read: Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!