Seethakka: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. నియామకాలకు ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం లా సెక్రటరీ బీ.పాపిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్, పీఆర్సీ చైర్మన్ ఎన్. శివశంకర్లతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల నియామకాల్లో ఎదురవుతున్న న్యాయ చిక్కులపై చర్చించారు. న్యాయ చిక్కులను అధిగమించే దిశలో వారి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు.
Also Read: Seethakka: అంగన్వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం.. మంత్రి సీతక్క హెచ్చరిక!
14 వేల వరకు అంగన్వాడీ ఖాళీ
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 14 వేల వరకు అంగన్వాడీ ఖాళీలుండగా, వాటి భర్తీకి ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్, హెల్పర్ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేసిన ప్రభుత్వం, చిన్నారులు తమ మాతృభాషలో నేర్చుకోవడం సులువవుతుందన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ఈ రిజర్వేషన్లు 50 శాతం మించిపోవడంతో, కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు స్టే విధించిందన్నారు. స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిక్రూట్మెంట్, సర్వీస్ రూల్స్ పరిశీలించి ముందుకు వెళ్లాలని సూచించారు.
10 రోజుల్లో నియామక ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేసిన విషయాన్ని మంత్రికి వివరించారు. దీనికి అనుగుణంగా తెలంగాణలోనూ అదే విధానాన్ని అవలంబించి సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించాలని మంత్రి ఆదేశించారు. సుప్రీం కోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేసి, స్టేను తొలగించుకునే చర్యలు వెంటనే ప్రారంభించాలని సూచించారు. సుప్రీం కోర్టు స్టేను తొలగించుకునేందుకు చట్టపరమైన చర్యలు ప్రారంభించి, 10 రోజుల్లో నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశలో కొత్త నియమాకాలు దోహద పడుతాయని..అందుకే అంగన్వాడీల నియమాకాలను సత్వరం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు.
Also Read: Seethakka: నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
