Bonalu Festival in Golconda: తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపే శక్తి సామర్థ్యాలు సీఎం (Revanth Reddy) రేవంత్ రెడ్డికి ప్రసాదించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ అమ్మవారిని వేడుకున్నారు. తెలంగాణ బోనాల జాతర ప్రారంభం సందర్భంగా అమ్మవారికి సమర్పించిన మొదటి బోనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని సర్కారు తరపున మంత్రులు కొండా సురేఖ, (Konda Surekha) పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ, గోల్కొండ జగదాంబ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని, కొన్ని వందల సంవత్సరాల నుండి జంట నగరాల్లో వైభవోపేతంగా బోనాల సాంప్రదాయం కొనసాగుతున్నదని, గోల్కొండ జగదాంబిక అమ్మవారు చాలా మహిమ గల తల్లి అని వ్యాఖ్యానించారు.
Also Read: Telangana Government: సర్కార్ కీలక నిర్ణయం పరిపాలనలో మరింత పారదర్శకత!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైదరాబాద్ జంట నగరాల్లో నిర్వహించే బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు ముందుగానే అందజేశారన్నారు. జగదాంబిక అమ్మవారి ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలని అలాగే, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని స్పీకర్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ, గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత చరిత్ర ఉందన్నారు. జంట నగరాల్లో దారులన్నీ గోల్కొండ వైపే ఉన్నాయని, ప్రజలు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, భక్తులు, ప్రజలకు పోలీసులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని మంత్రి సూచించారు.
మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాట్లాడుతూ, ఆషాడ మాసంలో సంప్రదాయబద్దంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, అలాగే ప్రభుత్వం ఈ బోనాల నిర్వహణకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందని వెల్లడించారు. భక్తులకు, వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తొలి బోనం ఎత్తుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సభా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిబాబు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: BRS Party: ప్రజా క్షేత్రంలో లేని సందడి.. స్థానిక ఎన్నికల వేళ ఎందుకీ దుస్థితి !