Bhatti Vikramarka: రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లతోపాటు గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్ అందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా రైతులు, గృహ జ్యోతి వినియోగదారులకు ప్రతినెలా కచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. అంబేద్కర్ సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు.
Also Read: Jawan Sucide: జీవితంపై విరక్తి చెందా.. అమ్మ నాన్నలను బాగా చూసుకోండి.. జవాన్ బలవన్మరణం
200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోలార్ రంగంపై ఆసక్తిగా ఉందని తెలుసుకుని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇదిలాఉండగా డిప్యూటీ సీఎం వారికి పలు అంశాలపై వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతంలో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని భట్టి వారికి వివరించారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం జర్మనీ ప్రతినిధులకు పేర్కొన్నారు.
విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం
జర్మన్ ప్రతినిధులు సూచించిన సోలార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో ఏవిధంగా అనుసంధానం చేసుకునేందుకు. తెలంగాణ విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్ బృందం ప్రతిపాదనలు ఏమేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. జర్మనీ ప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించాలని నవీన్ మిట్టల్ ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, రెడ్కో సీఎండీ అనిలా, జర్మన్ ప్రతినిధులు డాక్టర్ సెబాస్టియన్, డాక్టర్ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rishab Pragathi: రిషబ్ శెట్టి – ప్రగతి లవ్ స్టోరీ వెనుక ఉన్నదెవరంటే?
