Ponguleti Srinivas Reddy: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లోనూ వరద నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో గోదావరి, కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టం జరగకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
నష్టం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగకుండా చూడటమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ఉండాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తుల నిర్వహణ విభాగాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖల కమిషనర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని వెల్లడించారు.
Also Read: GHMC Commissioner: టౌన్ ప్లానింగ్పై.. ఫిర్యాదుల వెల్లువ!
ముందస్తు ప్రణాళికలు..
ఈ ఏడాది వర్షాకాల సీజన్ అనుకున్నదానికంటే 15 రోజుల ముందుగానే వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నది పరీవాహక ప్రదేశాలలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అకస్మాత్తుగా వచ్చే వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి, వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నష్టాన్ని తగ్గించే విధంగా ముందస్తు ఏర్పాట్లు
గత ఏడాది గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడటం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందని, ఈసారి కూడా అటువంటి పరిస్థితి ఎదురైతే నష్టాన్ని తగ్గించే విధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అత్యవసర సమయాలలో, వరద భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టంల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. మొబైల్ వైద్య బృందాలను, అవసరమైన మందులు, నీటి శుద్ధి మాత్రలు, పారిశుధ్య కిట్లు వంటివి తగిన మొత్తంలో అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హరీశ్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయితీరాజ్ కమిషనర్ సృజన, సీపీ డీసీఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్ బీ గోపి, ఐఎండీ అధికారిణి నాగరాత్నం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Also Read: Schools Reopen: నూతనోత్సాహంతో పాఠశాలల పున:ప్రారంభం!