Min Komati Reddy: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బీ(R&B) అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Min Komati Reddy Venkat Reddy) ఆదేశించారు. వర్షాల కారణంగా తెగిన రోడ్లు, కల్వర్టులకు తాత్కాలిక పునరుద్ధరణ చేపట్టి ప్రజారవాణాకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. అధిక వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీల(Bridge) వివరాలపై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ప్రాణనష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
మరో రెండు రోజులు
రాష్ట్ర వ్యాప్తంగా వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పూర్తి వివరాలు పంపించాలని ఆదేశించారు. పాడైన రోడ్లు, వంతెనలకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని, క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తనకు చేరవేయాలని మంత్రి తెలిపారు. ఏమాత్రం అలసత్వం వహించొద్దని, మరో రెండు రోజులు ఎవరూ సెలవుపై వెళ్లొద్దన్నారు. ఇదిలా ఉండగా వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రవాహాలకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ అండ్ బీ పరిధిలో 454 చోట్ల సమస్య ఏర్పడిందని మంత్రి వెల్లడించారు. అందులో 629 కిలోమీటర్ల రోడ్డు దెబ్బతిందని, 22 చోట్ల రోడ్డు తెగిపోతే వెంటనే 4 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశామని వివరించారు. 171 చోట్ల లో ఇంకా కాజ్ వే లు, కల్వర్టులు వరద ప్రవాహం ఉందని, రాకపోకలకు ఇబ్బంది ఉన్న 108 ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన 71చోట్ల క్లియర్ చేశామని, మిగతా చోట్ల వేగంగా క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Hydraa: బతుకమ్మ కుంటను సందర్శించిన ఢిల్లీ మున్సిపల్ బృందం
అత్యంత అప్రమత్తంగా
వాగుల వెంట 58 కిలోమీటర్ల మేర రోడ్డు కోతకు గురైందని, అందులో 378 మీటర్లు మూసివేశామని మంత్రి తెలిపారు. మొత్తంగా 147 చోట్ల లో కాజ్ వే, మైనర్ బ్రిడ్జీలు, కల్వర్టులు తాత్కాలికంగా, శాశ్వతంగా పునరుద్ధరించాలని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. మరో రెండు, మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు పూర్తిస్థాయి వివరాలు పంపాలని జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్లను కోమటిరెడ్డి ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్ మానిటరింగ్ చేయాలని స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ కు మంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తం జిల్లాలవారీగా ఆర్ అండ్ బీ 37 డివిజన్ల పరిస్థితులు, ఫీల్డ్ ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అలర్ట్ గా ఉన్నామని సీఈ మోహన్ నాయక్(Mohan Nayak) మంత్రికి వివరించారు.
Also Read: Social Service Organisations: గతంలో గుర్తింపు ప్రోత్సాహకాలు.. మరి ఇప్పుడు ఏది..?