Telangana Govt: ఖరీఫ్ (వానాకాలం) సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం (Telangana Govt) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సన్నధాన్యం పండించిన రైతుల (Farmers)కు ప్రభుత్వం బోనస్ అందించనుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలి ప్యాడీ డ్రైయర్స్, ప్యాడీ క్లీనర్లను ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రాలతో పంట చేతికి వచ్చిన తర్వాత వచ్చే నష్టం, రైతులు (Farmers) ఎక్కువగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడటం తగ్గనున్నాయి.
కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంపు
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను అమ్ముకునే సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొకుండా పకడ్బందీ చర్యలు చేపడుతుంది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందించింది. రైతుల (Farmers) సౌకర్యార్దం ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఖరీఫ్లో 7,139 కేంద్రాలు ఉండగా, ఈ ఏడాది వాటిని 8,332కి పెంచారు. సుమారు 1193 కేంద్రాలను ఎక్కువగా పెంచినట్లు అధికారులు తెలిపారు.
Also Read: OTT Movie: మంచు ఎడారిలో చిక్కుకున్న మహిళ సహాయం కోసం వస్తే.. థ్రిల్లింగ్ అదిరిపోద్ది
అక్టోబర్లో 6.89 లక్షల మెట్రిక్ టన్నులు
సన్న ధాన్యానికి బోనస్ అందించడంతో సాగు విస్తీర్ణం 60.39 లక్షల ఎకరాల నుంచి 65.96 లక్షల ఎకరాలకు పెరిగింది. రాష్ట్రంలో 2025-26 సీజన్లో 65.96 లక్షల ఎకరాల్లో 159.14 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. రాష్ట్రం 74.99 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనుంది. అక్టోబర్లో 6.89 లక్షల మెట్రిక్ టన్నులు, నవంబర్లో 32.95 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబర్ లో 27.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వింటా ధాన్యానికి సాధారణ రకానికి రూ.2369, ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 చెల్లించనున్నారు. గతేడాది 146.28 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, అందులో 91.28 లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది.
4.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
కొనుగోలు కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 4,252, ఐకేపీల ద్వారా 3,522, ఇతరుల ఆధ్వర్యంలో 558 ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 6.80 లక్షల మెట్రిక్ టన్నులు, జగిత్యాల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు, నల్లగొండ నుంచి 4.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపోయినంతగా తార్పాలిన్లు, ఆటోమ్యాటిక్ ప్యాడీ క్లీనర్లు, ఆటోమ్యాటిక్ ప్యాడీ డ్రైయర్స్, గ్రెయిన్ కాలిపర్స్, మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, హస్క్ రిమూవర్స్ తదితర వాటిని అందుబాటులో ఉంచనున్నారు.
రైతులు నష్టపోకుండా నివారణకు చర్యలు
ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 56 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ఉపయోగపడేలా వాతావరణశాఖ సూచనలను అందించనున్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ, సహకార, హౌం, గ్రామీణాభివృద్ధి, తూనికలు, కొలతల శాఖలతో సమన్వయం చేస్తున్నారు.
ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవలి
ధాన్యం రకాన్ని బట్టి వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. అదే విధంగా వరికోతలను బట్టి విడుతల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు వస్తే వెంటనే తెలియజేస్తే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా వర్షాభావ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఉదయం 6 గంటలకల్లా వాతావరణ సూచనలను జిల్లా అధికారుల ద్వారా రైతులకు తెలియజేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని టార్పాలిన్ షీట్లు కప్పి, తూకం చేసిన సంచులను కంటైనర్లలో భద్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా రైతులకు ఆలస్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవస్థను సిద్ధం చేస్తోంది.