Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1612.37 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్(VP Goutham) ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.12 లక్షల ఇండ్ల పనులు ప్రారంభమవ్వగా ఇప్పటి వరకు సుమారు 1.50 లక్షలకు పైగా ఇండ్లకు సంబంధించిన చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణపు పనుల దశలను బట్టి లబ్ధిదారులకు విడుతల వారీగా మొత్తం రూ.5 లక్షలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వివరించారు.
12 వేల పైచిలుకు గ్రామాలు..
లబ్ధిదారుల్లో ఎవరికైనా బిల్లు మొత్తం జమ అవ్వకుంటే వారు తమ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆధార్ నంబర్ ను ఖాతాకు అనుసంధానించుకోవాలని వీపీ గౌతమ్ సూచించారు. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు ఆధార్ నంబరు ఆధారంగా నేరుగా నిధులు జమ చేస్తున్నట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేల పైచిలుకు గ్రామాలు, సుమారు 4 వేల మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. అనేక ప్రాంతాల్లో ప్రతినిత్యం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పూర్తి పారదర్శకమైన విధానంతో, అధునాతన టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమచేస్తున్నట్లు వీపీ గౌతమ్ వివరించారు. అందులో భాగంగా ఈ వారానికి(ఈనెల 24 వరకు)గాను రికార్డుస్థాయిలో 17 వేల ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల నిమిత్తం రూ.188.35 కోట్లను లబ్ధిదారులకు విడుదల చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి వరకు విడుదల చేసిన బిల్లుల వివరాలు
బేస్ మెంట్ స్థాయి : రూ.1210.76 కోట్లు(1,21,076 ఇండ్లకు)
రూఫ్ లెవల్(గోడలు పూర్తి) : రూ.252.64 కోట్లు(25,264 ఇండ్లకు)
రూఫ్ క్యాస్టెడ్(శ్లాబ్ పూర్తి) : రూ.155.44 కోట్లు(7,772 ఇండ్లకు)
Also Read: GHMC: జీహెచ్ఎంసీ మూడు కీలక శాఖ అధికారులకు స్థానచలనం.. ఉత్తర్వులు జారీ!