Telangana: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయిస్తూ జీవో నెంబర్ 46ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్టీ రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. తాజా జీవో నేపథ్యంలో రేపు సా.6 గంటల్లోగా ఖరారు చేసిన రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖకు కలెక్టర్లు అందజేయనున్నారు.
అయితే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య సర్వే (SEEPC 2024 జనాభా డేటా) ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ సర్కార్ తాజా జీవోలో స్పష్టం చేసింది. 100 శాతం ఎస్టీలతో ఉన్న గ్రామాల్లోని వార్డులు, సర్పంచ్ స్థానాలను ఎస్టీలకే కేటాయిస్తామని పేర్కొంది. మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన స్థానాలను మళ్లీ అదే కేటగిరీకి రిజర్వ్ చేయకూడదని స్పష్టం చేసింది. ఎంపీడీవో ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్లు, ఆర్డీవో ఆధ్వర్యంలో సర్పంచ్ ల రిజర్వేషన్ల నిర్ణయం ఉంటుందని పేర్కొంది. మహిళల రిజర్వేషన్లను అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలని సూచించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. బందోబస్తు సమర్ధవంతంగా అమలు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలన్నారు. అయితే డిసెంబరు 11న మొదటి దశ, 14న రెండో దశ, 17న మూడవ దశలో ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉన్నది.
