TG Cyber Security: రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చైల్డ్ పోర్న్ వీడియోలు, కంటెంట్ ను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తున్న 24మందిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు క్రిమినల్స్ కు బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన మరో 10మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలిగా సోషల్ ప్లాట్ ఫాంలలో చైల్డ్ పోర్నోగ్రఫీ, కంటెంట్ ఎక్కువగా అప్ లోడ్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఒక్కరోజు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో భాగంగా 18బృందాలను రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దింపారు. ఈ బృందాలు పక్కాగా ఆధారాలు సేకరించి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న 24మందిని అరెస్ట్ చేశాయి. అరెస్టయిన వారిలో 18నుంచి 48ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉండటం గమనార్హం. ఈ నెట్ వర్క్ లో నీటిపారుదల శాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఉన్నాడు. పట్టుబడ్డ 24మంది నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీతోపాటు పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం కేసులు నమోదు చేశారు.
నాలుగేళ్ల బాలికను..
రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసముంటున్న కందాడ శ్రీకాంత్ (24) ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీలో గార్డుగా పని చేస్తున్నాడు. కాగా, ఓ నాలుగేళ్ల బాలికను అభ్యంతరకరంగా వీడియో రికార్డింగ్ చేసి దానిని గూగుల్ డ్రైవ్ లోకి అప్ లోడ్ చేశాడు. ఇక, నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ ఉద్యోగి తన వికృతానందం కోసం ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. టిప్ లైన్ ద్వారా అతనిపై ఫిర్యాదులు రాగా స్పెషల్ ఆపరేషన్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితునిపై నిజామాబాద్ సీసీపీఎస్లో కేసులు నమోదయ్యాయి.
Also Read: Rajaiah Slams Kadiyam Srihari: నా అభివృద్ధి నీ ఖాతాలో వేసుకుంటావా? కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్!
మ్యూల్ ఖాతాలిచ్చి..
ఇక, చైల్డ్ పోర్న్, అబ్యూసీవ్ కంటెంట్ ను సోషల్ మీడియాలోకి అప్ లోడ్ చేస్తున్న వారికి బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన మరో 10మందిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. వీరిపై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లు, వరంగల్(Warangal), రామగుండం(Ramagundam), కరీంనగర్(Karimnagar)లలో కేసులు నమోదయ్యాయి. ఈ పది మంది ఖాతాల ద్వారా 26 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ జరిపిన డైరెక్టర్ శిఖా గోయల్ తోపాటు దీంట్లో కీలకపాత్ర వహించిన ఎస్పీలు హర్షవర్ధన్, సాయిశ్రీతోపాటు సూర్యప్రకాశ్, కేవీఎం.ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఫణీందర్ వెంకట రంగారెడ్డి, గిరికుమార్, శ్రీనివాసు తదితరులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు.
Also Read: RajaSaab Controversy: ‘ది రాజాసాబ్’లో తన మ్యూజిక్ కాపీ కొట్టారంటూ.. చెప్పు చూపించిన స్వీడన్ డీజే..

