CM Revanth Reddy: కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని, అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉండటంతో ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ అనుసరించాల్సిన వైఖరిపై శనివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో న్యాయ నిపుణులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణాకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునేది లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని సీఎం తెలిపారు. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి, తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్ కు అందజేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంటన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలని చెప్పారు.
Also Read: Maoist Leader Sujatha Surrenders: పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సుజాత లొంగుబాటు!
ఏపీకీ 512 టీఎంసీలు
గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, అప్పటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. సీఎం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవటంతో వ్యవహరించటంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంది
గడిచిన పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టిందన్నారు. నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరించటంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్ ముందుకు తీసుకురావాలన్నారు.
కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటం
శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు 10 టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందన్నారు. ఎక్కడపడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం ముంచుకు వచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతోందన్నారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ఎదుట వాదనలుగా వినిపించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయన్నారు.
వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం
సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటి వరకు తెలంగాణా ప్రాంతంలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణ వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో పాటు, కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే వాదనలు కావటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని న్యాయ నిపుణులకు సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ కె.వోహ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్,నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఇ.ఎన్.సీ అంజద్ హుస్సేన్, సీఎంవో సెక్రెటరీ మాణిక్రాజ్, ఇరిగేషన్ అధికారులుపాల్గొన్నారు.
Also Read: Krishna Water Dispute: చుక్క నీరు కూడా వదలం.. తెలంగాణ వాటా సాధిస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్